Narendra Modi
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఇరుదేశాలకు సంబంధించి పలు వాణిజ్య, రక్షణ రంగానికి చెందిన అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. భారత రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసేలా.. అమెరికా నుంచి మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ట్రంప్, మోదీ మీడియా సమావేశంలో సంయుక్తంగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ ప్రస్తావించారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సరియైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారివారి దేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో సరియైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 104 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి పంపించివేశారు. కొద్దిరోజుల క్రితమే ఆ విమానం అమృత్ సర్ కు చేరుకుంది. ఫిబ్రవరి 15న అక్రమ వలసదారులతో కూడిన మరో అమెరికా సైనిక విమానం అమృత్ సర్ కు రాబోతున్నట్లు సమాచారం. అమెరికా లెక్కల ప్రకారం.. చట్టపరమైన పత్రాలు లేకుండా దాదాపు 18వేల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వారందరినీ తిరిగి ఇండియాకు పంపించేలా ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ అంశంపై అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందు ప్రస్తావించారు.
Also Read: Donald Trump: మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే.. ఇండియాకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..! అదేమిటంటే..
ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కులేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని తెలిపారు. ‘‘అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాం. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఒకదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు. ఈ విధానం ప్రపంచం అంతటికీ వర్తిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Washington, DC: On the illegal immigration issue, PM Narendra Modi says, “…Those who stay in other countries illegally do not have any legal right to be there. As far as India and the US are concerned, we have always said that those who are verified and are truly the… pic.twitter.com/Qa0JEnAjyp
— ANI (@ANI) February 13, 2025
డబ్బు, ఉద్యోగాలు ఆశజూపి కొంతమంది యువత, పేదరికంలో ఉన్నవారిని మోసం చేస్తున్నారు. అలావారు అక్రమ వలసదారులుగా మారుతున్నారు. వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్తున్నారని మోదీ అన్నారు. అలాంటి వాటిని సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం అని మోదీ పేర్కొన్నారు.