Israel Hezbollah War: నస్రల్లా హత్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్
నస్రల్లా మరణం తరువాత అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా, లెబనాన్ లపై ఇజ్రాయెల్ దాడుల్లో ,..
- Harishth Thanniru
- Published On : September 29, 2024 / 08:30 AM IST
Joe Biden
Hezbollah Chief hassan nasrallah: లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా మృతిచెందాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ తోపాటు లెబనాన్ కూడా దృవీకరించింది. శుక్రవారం బీరుట్ లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో నస్రల్లాతో పాటు అతని కుమార్తె, మరో ముప్పై మందికిపైగా మరణించారు. దాదాపు 200 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
Also Read : కసితో పోరాడింది, ఒక్కొక్కరిని మడత పెట్టేసింది.. హిజ్బులా టాప్ లీడర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్..!
గత ఏడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ ప్రారంభమైందని జో బైడెన్ వెల్లడించారు. హెజ్బొల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతును ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మరణించారని బైడెన్ గుర్తు చేశారు. ఇదిలాఉంటే.. బీరుట్ లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు ఆ ప్రాతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది.
Also Read : Hassan nasrallah: హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతం.. ధృవీకరించిన ఇజ్రాయెల్
నస్రల్లా మరణం తరువాత అమెరికాపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజా, లెబనాన్ లపై ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా ప్రమేయంపై ఇరాన్ మండిపడుతుంది. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబులు అమెరికా బహుమతిగా ఇచ్చినవని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడిలో అమెరికా ఇచ్చిన 5వేల ఫౌండ్ల బరువున్న బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించిందని ఇరాన్ పేర్కొంది. అయితే, బీరూట్ లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించిన విషయంపై తమకు మందస్తు సమాచారం లేదని అమెరికా పేర్కొంది.
