Israeli-Palestianian Escalation : మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న మారణహోమంపై ఓవైపు ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా… అమెరికా వైఖరి మాత్రం వేరేలా ఉంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ.. యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో దీనిపై ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ జరగాలంటూ చైనా, నార్వే చేసిన ప్రతిపాదనకు అమెరికా అభ్యంతరం తెలిపింది.
అటు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. రెండు పక్షాలూ శాంతి స్థాపనకు ప్రయత్నించాలని పిలుపునిస్తూనే ఆయన ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచారు. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఆ దేశానికున్నదంటూ సమర్థించారు. దీనిపై యూరోప్తో పాటు పలు దేశాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఇక తాజాగా ఐక్యరాజ్యసమితిలో చర్చకు అడ్డు తగిలేలా వ్యవహారించడంపై విమర్శలు పెరుగుతున్నాయి.
ఇటు గాజా స్ట్రిప్ను పర్యవేక్షిస్తున్న హమాస్కూ, అటు ఇజ్రాయెల్ దళాలకూ మధ్య సాగుతున్న సమరంలో ఇప్పటిదాకా 83 మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. ఇందులో 17 మంది పిల్లలు, ఏడుగురు మహిళలున్నారు. మరో 480 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్వైపు ఒక సైనికుడు, ఆరుగురు పౌరులు మరణించగా అందులో కేరళకు చెందిన ఒక నర్సు కూడా ఉన్నారు.