Drishyam 2: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను జీతూ జోసెఫ్ పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమాను తెలుగులో వెంకటేశ్, తమిళ్లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్గన్లు రీమేక్ చేసి వారు కూడా సూపర్ హిట్ అందుకున్నారు.
ఈ సినిమాకు సీక్వెల్గా మలయాళ ‘దృశ్యం-2’ గతేడాది కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. అటు తెలుగులోనూ ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా తెరకెక్కించగా, ఆ సినిమాను కూడా కరోనా ప్రభావంతో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అయితే తాజాగా బాలీవుడ్లోనూ దృశ్యం-2 చిత్రాన్ని అజయ్ దేవ్గన్ రీమేక్ చేశాడు. కానీ, ఆయన ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతకొంతకాలంగా బాలీవుడ్లో సినిమాలు ఏవీ కూడా ఈ స్థాయిలో రెస్పాన్స్ను అందుకోలేకపోయాయి.
‘దృశ్యం 2’ లో విక్టరీ వెంకటేష్.. మరో హిట్ పక్కా..
బాలీవుడ్ జనాలు దృశ్యం-2 సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.64 కోట్ల కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తొలివారం ముగిసేసరికి ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి రావడం ఖాయమని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్తో బడా హీరోల సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న తరుణంలో అజయ్ దేవ్గన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుని మరోసారి కంటెంట్ బాగుంటే సినిమాకు ప్రేక్షకులు పట్టం కడతారని రుజువు చేశాడు. అయితే ఈ సినిమా వసూళ్లు చూస్తుంటే, దక్షిణాదిన ఈ సినిమాకు ఏ రేంజ్లో థియేటర్ బిజినెస్ మిస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మరి దృశ్యం-2 సినిమాను మలయాళ, తెలుగు భాషల్లో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి మనవాళ్ళు తప్పుచేశారా అనే ప్రశ్న ప్రస్తుతం ప్రేక్షకుల్లో తలెత్తుతోంది.