Oscars Academy Awards 2021 : ఈ ఏడాది ప్రేక్షకులు లేకుండానే ఆస్కార్ వేడుకలు.. రెండు వేదికల్లో అవార్డులు
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 ఆస్కార్ అవార్డుల వేడుకలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డుల ఉత్సవం పూర్తి భిన్నంగా ఉండబోతుందని డేవిడ్ రూబిన్ వెల్లడించారు.
- Sreehari A
- Published On : March 16, 2021 / 09:51 PM IST
Oscars Academy Awards 2021
Oscars Academy Awards 2021 : సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే ఆస్కార్ అకాడమీ అవార్డులను కరోనా మహమ్మారి కారణంగా ఈసారి విభిన్నంగా నిర్వహించాల్సి వస్తోంది. ప్రతి ఏడాదిలో ఫిబ్రవరి చివరి వారంలో ప్రదానం చేయడం ఆనవాయితీ.
ఇప్పటికే ఈ అవార్డు వేడుకలు కరోనా కారణంగా రెండు నెలలు పాటు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఆస్కార్ నామినేషన్ విడుదల చేసారు.
అన్ని ఇతర అవార్డుల మాదిరిగానే ఈ ఏడాదిలో ఆస్కార్ అవార్డులను కూడా కోవిడ్-19 మహమ్మారి కారణంగా తగ్గించారు. ఈసారి ఆస్కార్ అవార్డుల ఉత్సవం పూర్తి భిన్నంగా ఉండబోతుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఈమెయిల్ ద్వారా లేఖను పంపారు. దాదాపు 10వేల మంది సభ్యులకు ఈ లేఖను పంపినట్టు తెలిపారు. ప్లస్ వన్ ఉన్న సమర్పకులు నామినీలు మాత్రమే వ్యక్తిగతంగా హాజరవుతారని రూబిన్ ధృవీకరించారని ఓ నివేదిక వెల్లడించింది.
ఏప్రిల్ నెల నాటికి మహమ్మారి తగ్గుముఖం పడుతుందని ఆశించినప్పటికీ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే మా ఆస్కార్ సభ్యులు, నామినీల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా మొదటిసారి ఆడియోన్స్ లేకుండా ఆస్కార్ అవార్డులను అందించనున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
ఈ 93వ అకాడమీ అవార్డులను రెండు వేర్వేరు ప్రాంతాల వేదికలైన హాలీవుడ్ డాల్బీ థియేటర్, డౌన్ టౌన్లో LAలోని చారిత్రాత్మక యూనియన్ స్టేషన్ వద్ద అందించనున్నట్టు ప్రకటించారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ రెండు వేదికల్లో నామినీలు, ప్రజెంటర్లు, సిబ్బంది అవార్డుల ఉత్సవంలో పాల్గొననున్నారు. ఈసారి ప్రేక్షకులు లేనందున, అవార్డుల ప్రధానోత్సవం చుట్టూ జరిగే అన్ని ఇతర ఈవెంట్లను కూడా రద్దు చేయనున్నట్టు రూబిన్ వెల్లడించారు.
ఏప్రిల్ 25 అవార్డుల ప్రదర్శనకు ముందు ఆస్కార్ నామినీస్ లంచ్ ఉండదన్నారు. ఆస్కార్ నామినీస్ లంచన్ గవర్నర్ బాల్ సహా అన్ని మార్పులు చేయవలసి వచ్చిందని లేఖలో రూబిన్ పేర్కొన్నారు.
