Chiranjeevi – Pawan Kalyan : దర్శకుడు వాసు మరణం పై చిరు, పవన్ సంతాపం..
ప్రముఖ దర్శకుడు కె వాసు మరణానికి చింతిస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు.
- gum 95921
- Published On : May 27, 2023 / 10:41 AM IST
Chiranjeevi Pawan Kalyan condolence on k vasu demise
K Vasu : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె వాసు నిన్న (మే 26) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు హీరోగా ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన వాసు.. చిరంజీవిని ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాసు మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.
చిరంజీవి..
సీనియర్ దర్శకులు కె.వాసు గారు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది. నా కెరీర్ తొలి రోజుల్లో చేసిన ప్రాణం ఖరీదు, తోడుదొంగలు, అల్లుళ్లు వస్తున్నారు, కోతల రాయుడు చిత్రాలకి ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.
పవన్ కళ్యాణ్..
దర్శకులు శ్రీ కె వాసు గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి గారు ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా శ్రీ వాసు గారిని మరచిపోలేం. చిరంజీవి గారు తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. శ్రీ కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైనది. తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. శ్రీ వాసు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
కాగా కె వాసు తండ్రి కూడా పరిశ్రమలో దర్శకుడిగా పని చేసిన వారే. ప్రముఖ దర్శకుడు కె ప్రత్యగాత్మ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కె వాసు.. కృష్ణంరాజు హీరోగా ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కోతలరాయుడు, తోడు దొంగలు, అల్లులొస్తున్నారు వంటి సినిమాలతో పాటు డివోషనల్ మూవీస్ లో ఒక క్లాసిక్ గా నిలిచిన శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, అయ్యప్పస్వామి మహత్యం వంటి చిత్రాలతో అలరించారు. చివరిగా 2008 లో ‘గజిబిజి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన వాసు.. అప్పటి నుంచి దర్శకత్వానికి దూరమయ్యారు.
