Rana Daggubati: రానాపై కేసు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆయన టీమ్
అగ్రిమెంట్లు చేసుకునే ముందు తమ లీగల్ టీమ్ విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు.

Rana Daggubati
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై సినీ నటుడు దగ్గుబాటి రానాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. మరికొందరు సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి. దీనిపై రానా టీమ్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
స్కిల్స్ బేస్డ్ గేమ్లకు మాత్రమే రానా అంబాసిడర్గా వ్యవహరించారని చెప్పింది. రానా చేసిన ఆ యాడ్ గడువు సైతం 2017లోనే ముగిసిందని తెలిపింది. ఆ ప్రకటన కూడా కొన్ని ప్రాంతాల్లోనే టెలికాస్ట్ అయిందని చెప్పింది.
Also Read: వాళ్లకు లీగల్ నోటీసులు పంపాను: బెట్టింగ్ యాప్ కేసుపై ప్రకాశ్ రాజ్
చట్టబద్ధత ఉన్న యాప్లకే రానా ప్రచారం చేశారని రానా టీమ్ పేర్కొంది. అగ్రిమెంట్లు చేసుకునే ముందు తమ లీగల్ టీమ్ విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు. చట్టపరంగా పరిశీలించిన అనంతరమే ప్రచారం చేయడానికి రానా ఒప్పుకున్నారని తెలిపారు. జూదానికి వ్యతిరేకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఆన్లైన్ గేమ్లను గుర్తించిందని చెప్పింది.
ఈ గేమ్లు ఛాన్స్ మీద కాకుండా స్కిల్స్ బేస్డ్గా ఉన్నాయని తెలిపింది. దీనికి చట్టబద్ధంగా అనుమతించినట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని రానా టీమ్ పేర్కొంది. రూల్స్కు విరుద్ధంగా పనిచేసే ఏ కంపెనీకి కూడా రానా అంబాసిడర్గా వ్యవహరించడం లేదని స్పష్టం చేసింది.
కాగా, క్రీడలు, క్యాసినో వంటి అనేక గేమ్స్లో డబ్బులు పెట్టేందుకు కొందరు బెట్టింగ్ యాప్స్ను తయారు చేస్తున్నారు. వీరి చేతుల్లో చాలా మంది మోసపోతున్నారు. ఐపీఎల్ సీజన్లలో వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.