Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రాంచరణ్ దంపతులు.. ఎందుకంటే..
ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా విలు విద్య వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మాకు సహాయపడుతుంది.
- Naveen
- Updated on- October 11, 2025 / 06:45 PM IST
Ram Charan: మెగా హీరో రాంచరణ్ ప్రధాని మోదీని కలిశారు. తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రధానిని కలిశారు రామ్ చరణ్. ఇటీవలే ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ లీగ్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ సందర్భంగా దేశ ప్రధాని మోదీని కలిసినట్లు రాంచరణ్ తెలిపారు. ప్రధానిని కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చెర్రీ.
ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన అనుభవాన్ని రాంచరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనిల్ కామినేని నేతృత్వంలో జరిగిన ప్రపంచంలోని మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయంపై మన ప్రధానిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను అని చరణ్ అన్నారు.
”ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల పట్ల మక్కువ ప్రపంచవ్యాప్తంగా విలు విద్య వారసత్వాన్ని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మాకు సహాయపడుతుంది. అథ్లెట్లందరికీ అభినందనలు. మెరుగైన శారీరక ఆరోగ్యం కోసం ఈ అద్భుతమైన క్రీడలో ఇంకా చాలా మంది చేరతారని మేము ఆశిస్తున్నాము” అని రాంచరణ్ ఆకాంక్షించారు.
భారత్ లో క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడలకు వేర్వేరు లీగ్స్ ఉన్నాయి. అయితే, ఈ ఏడాది తొలిసారి ఆర్చరీ (విలు విద్య) లీగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి టీమ్స్ ఈ లీగ్ లో పోటీ పడ్డాయి.
Also Read: ‘డార్క్ చాక్లెట్’ టీజర్ రిలీజ్.. బాబోయ్ మొత్తం బూతులేగా.. రానా సమర్పణలో..
