తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌

  • Publish Date - May 28, 2020 / 03:56 AM IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి 97వ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం(28 మే 2020) ఉదయం నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి కూడా దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో ఆయన నిలిచారని అన్నారు. 

ఇదే సమయంలో సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. షూటింగ్‌లు తుదిదశకు వచ్చిన సినిమాలకు ముందుగా అవకాశం ఇవ్వాలని సూచించామని, జీవో వచ్చాక సినిమాల షూటింగ్‌లు మొదలు అవుతాయని బాలకృష్ణ వెల్లడించారు. 

Read:  ఏమాయ చేసావే సీక్వెల్..శింబు ఒకే అంటే – గౌతమ్ మీనన్