రోజుకి రూ.250 ఇచ్చేవారు – ఫెయిల్యూర్స్ను ఎంజాయ్ చేస్తాను : నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా
‘డిస్కో రాజా’ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్న ప్రముఖ నటుడు బాబీ సింహా..

‘డిస్కో రాజా’ సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్న ప్రముఖ నటుడు బాబీ సింహా..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ఫిక్షన్ చిత్రం.. ‘డిస్కోరాజా’. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ మూవీలో విలన్ పాత్ర పోషించిన తెలుగువాడు, ప్రముఖ తమిళ నటుడు, జాతీయ అవార్డునందుకున్న బాబీ సింహా మీడియాతో పలు ఆసక్తి కరమైన విశేషాలు చెప్పారు.
‘‘మా తల్లిదండ్రులది విజయవాడ దగ్గర బందర్. నేను హైదరాబాద్లో పుట్టాను. నాలుగో తరగతి వరకు హైదరాబాద్లో చదివాను. పదో తరగతి వరకు అవనిగడ్డలో చదువుకున్నాను.1995లో తమిళనాడులోని కొడైకెనాల్కు వెళ్లాం’’..
‘‘కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేశాను. కష్టాలు అనుభవించాను. రోజుకి రూ.250 ఇచ్చేవారు. రూ.50లు తో ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చేవాణ్ణి.. ఇప్పుడు డబ్బులున్నా టైమ్ దొరకడం లేదు.. అయితే అప్పటితో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ స్థాయి పెరిగింది. సోషల్ మీడియా ఉంది. నేను మొదట్లో తిరిగినట్లు చాలామంది హైదరాబాద్, చెన్నైలో యాక్టర్స్ కావాలని తిరుగుతుంటారు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం కోసం ఎదురుచూడండి. వచ్చినప్పుడు మాత్రం శక్తి వంచన లేకుండా పని చేసి మనల్ని మనం నిరూపించుకోవాలి’’..
Read Also : మళ్లీ ప్రేమలో పడతా.. విడాకులపై స్పందించిన శ్వేతాబసు
‘‘రజనీకాంత్గారు నాకు స్ఫూర్తి. ‘పేట’లో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ప్రస్తుతం కమల్హాసన్గారి ‘ఇండియన్ 2’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కమల్గారికి అన్ని క్రాఫ్ట్స్పై అవగాహన ఉంది. తమిళంలో నా గత చిత్రాలు సక్సెస్ కాలేదు. ఫెయిల్యూర్స్ను ఎంజాయ్ చేస్తాను. కానీ, ఆడని సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదో విశ్లేషించుకుంటాను. నాతో పాటు స్టార్ట్ అయిన విజయ్ సేతుపతి ముందుకు పరిగెడుతున్నారు అంటున్నారు. నేను వెనక నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను’’..
‘‘‘డిస్కోరాజా’లో నేను సేతు పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో స్టైల్, కోపం, హాస్యం.. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లా సినిమాలో నావి రెండు లుక్స్ ఉన్నాయి. రవితేజగారు సెట్లో ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్ బాగుంటాయి. నేను దాదాపు 45 సినిమాలు చేశాను. నా కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్గా ఆనంద్గారి పేరు చెబుతాను. ఆనంద్గారు కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంటారు’’..
‘‘నటుడిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. పాజిటివ్ క్యారెక్టర్ అయితే కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సి ఉంటుంది. అదే నెగటివ్ క్యారెక్టర్ అయితే యాక్టింగ్కు ఎలాంటి పరిమితులు ఉండవని నా భావన. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు.. కథ బాగుంటే నటిస్తాను’’..
‘‘అన్ని ఉంటాయి. జోవియల్, సీరియస్ అండ్ నా శైలి యాక్టింగ్ ఇలా అన్ని ఉంటాయి. ఈ సినిమాలో ‘బర్మా సేతు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నా రోల్ కాస్త కొత్తగా కూడా ఉంటుంది. నేను కూడా కొత్తగా కనిపిస్తాను, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’..
‘‘రవితేజగారిది వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ. ఆయన మార్క్ యాక్టింగ్ సినిమాలో చాలా బాగా అలరిస్తోంది. ఇక ఆయనలో నాకు బాగా నచ్చింది ఆయన టైమ్ సెన్స్ అండ్ జెన్యూనిటీ. టైమింగ్, టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారాయన’’..
‘‘అవార్డుకు అనుభవం అనేది ఒక కొలమానంగా ఉండాలనే మాట నా దృష్టిలో సరైంది కాదనుకుంటాను. అవార్డు అనేది ప్రేక్షకులు, ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. నాకు కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి మనం చేసే పాత్రకు మనం న్యాయం చేశామా? లేదా? ప్రేక్షకులు మనల్ని గుర్తించారా? లేదా అన్నదే ముఖ్యం. ‘జిగర్తాండ’ చిత్రానికి నాకు జాతీయ అవార్డు రావడం సంతోషాన్నిచ్చింది. నిజానికి నాకు జాతీయ అవార్డు గురించి మొదట్లో తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు… ‘‘సార్… నేషనల్ అవార్డు అనేది నేను చేసినా కూడా వస్తుందా? అని అడిగితే, ‘హే… బాబీ అది నేషనల్ అవార్డు’ వదిలేయ్.. అని ఓ డైరెక్టర్ అన్నారు’’.. అంటూ ఇంటర్వూ ముగించారు బాబీ సింహా..