Madam Chief minister Movie : ఎస్.ఆర్.పి ప్రొడక్షన్స బ్యానర్పై తొలి చిత్రంగా రూపొందుతున్న ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేవతిగారి మాటల్ని బట్టి చూస్తే సోసైటీకి సంబంధించిన చిత్రంగా అనిపించింది. 5 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం సక్సెస్ఫుల్గా ఆడాలి అని అన్నారు.
నటి దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ.. బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లాను. సక్సెస్ఫుల్ గా చదువు పూర్తి చేసి పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ లో డాక్టరేట్ చేసి అక్కడొక కంపెనీ ప్రారంభించా. అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదు. మనం తల్లిదండ్రులు, గురువు, రుణం తీర్చుకుంటాం. సామాజిక రుణం అంటే దేశ రుణం మాత్రం మరచిపోతాం. దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలు వచ్చి ఓ విలేజ్ని అడాప్ట్ చేసుకున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్తో సమానంగా అభివృద్ధి చేశా. నా సంపదలో 20 శాతం సోసైటీకి ఇచ్చేశాను. ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. జనాల్లో మార్పు కోసం ఈ పని చేస్తున్నా. ఏడేళ్లగా నేను చేస్తున్న నా సేవలను గుర్తించి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చింది. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించింది. సినిమా అనేది సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే మేడమ్ చీఫ్ మినిస్టర్ సినిమా ప్రారంభించా. కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ చిత్రం ఉంటుంది. యువతను బాగా కనెక్ట్ అవుతుంది. ఇది పొలిటికల్ సినిమా కాదు.. పబ్లిక్ మూవీ. ప్రపంచంలో ఇండియా అనేది చాలా గొప్పది అని చెప్పాలి. అదే నా గోల్. సినిమాకు చెందిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని తెలిపారు. రచయిత సుహాస్ మీరా, ఎస్.బి.రామ్, డా.సూరి భసవంతం ఫౌండేషన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.