గుజరాత్ వడోదరలోని పద్రా తాలుకాలో గల గ్యాస్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఎయిమ్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్లో శనివారం (జనవరి 11,2020) ఉదయం 11గంటలకు సంభవించిన ఈ పేలుడులో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పరిశ్రమలు, వైద్యరంగానికి అవసరమైన గ్యాస్లను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ ఇతర వాయువులను కంపెనీ తయారు చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టింది. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.