ఏడేళ్ల బాలుడు ఎడమ కంటికి సర్జరీ చేయించుకునేందుకు వెళ్తే కుడి కంటికి చేసిన డాక్టర్
ఆ బాలుడి ఎడమ కంటిని పరీక్షించిన వైద్యుడు ఆనంద్ వర్మ అతడి కంటిలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఉందని చెప్పాడు.

యుధిష్ఠిర్ (7) అనే ఓ బాలుడు ఎడమ కంటికి సర్జరీ చేయించుకునేందుకు ఆసుపత్రిలో చేరితే అతడి కుడి కంటికి ఆపరేషన్ చేశాడు డాక్టర్. గ్రేటర్ నోయిడాలోని ఆనందర్ స్పెక్ట్రమ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ బాలుడి తండ్రి నితిన్ భాటి తెలిపిన వివరాల ప్రకారం.. ఎడమకంటి నుంచి ఆ బాలుడికి తరచూ నీరు వస్తోంది. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ బాలుడి ఎడమ కంటిని పరీక్షించిన వైద్యుడు ఆనంద్ వర్మ అతడి కంటిలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఉందని చెప్పాడు.
ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని, అందుకు రూ. 45,000 ఫీజు అవుతుందని అన్నాడు. యుధిష్ఠిర్కు మంగళవారం వైద్యుడు ఆపరేషన్ చేశాడు. అనంతరం ఇంటికి పంపాడు. ఇంటికి చేరుకోగానే బాలుడి తల్లి ఆ బాలుడి కంటిని గమనించింది. ఎడమ కంటికి సర్జరీ చేయకుండా కుడి కంటికి చేశారని గుర్తించింది.
అనంతరం వారు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను నిలదీశారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులతో ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. చివరకు ఆ బాలుడి కుటుంబ సభ్యులు గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. డాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని, ఆసుపత్రికి సీల్ వేయాలని ఆ బాలుడి తండ్రి డిమాండ్ చేశారు.