Adani Group clarifies: అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ మూడు ఫండ్స్ అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టాయని, వీటిని ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన వార్తలపై తమ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ను వివరణ కోరగా.., అలాంటిదేమీ లేదని తమకు సమాచారం అందిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. పత్రికలలో వచ్చిన వార్తల వల్ల తమ కంపెనీలోని మైనారిటీ షేర్ హోల్డర్లు భారీ మొత్తంలో నష్టపోయారని స్పష్టంచేసింది.
ఈ క్రమంలోనే ప్రజల కోసం, మైనారిటీ షేర్ హోల్డర్ల కోసం బహిరంగ లేఖను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం ఏమాత్రం కారణం లేకుండా.. NSDL, Albula Investment, Cresta మరియూ APMS Investment ఫండ్స్ని ఫ్రీజ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
రూ.43వేల 500కోట్ల పెట్టుబడి పెట్టిన మూడు విదేశీ ఇన్వెస్టర్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లుగా వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెట్లో కలకలం రేగింది. ముఖ్యంగా నిన్నటి దాకా హాట్ కేకుల్లా ఉన్న అదానీ గ్రూప్ షేర్లను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అదానీ గ్రూప్ షేర్లను కూడా రిగ్గింగ్ చేశారని, ఈ అంశంపై సెబీ దర్యాప్తు ప్రారంభించనే వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో దాదాపు అన్ని అదానీ కౌంటర్లు లోయర్ సర్యూట్ను టచ్ చేశాయి.
గ్రూప్లో ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ నిన్న రూ. 1601 వద్ద ముగిసింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే ఈ షేర్ ఏకంగా 20 శాతం క్షీణించి రూ. 1201ను తాకింది. తరవాత కోలుకుని ఇపుడు 15 శాతం నష్టంతో రూ. 1357 వద్ద ట్రేడ్ అవుతోంది. మరో ప్రధాన కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేర్ కూడా ఇవాళ 20 శాతం క్షీణించి రూ. 681కు పడిపోయింది. ఆ తరవాత కోలుకుని 13.3 శాతం నష్టంతో రూ.728.10 వద్ద ఈ షేర్ ట్రేడ్ అయ్యింది.