Bhagavad Gita(Photo : Google)
Thief Gave Back Jewels : భగవద్గీత ఓ దొంగలో మార్పు తెచ్చింది. అతడికి జ్ఞానోదయం కలిగించింది. అంతే, 9ఏళ్ల క్రితం తాను చోరీ చేసిన దేవుడి (శ్రీకృష్ణుడు) ఆభరణాలను తిరిగి ఇచ్చేశాడు. వినడానికి వింతగా ఉన్నా, నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. విస్మయానికి గురి చేసే ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. గోపీనాథ్ పూర్ లో రాధాకృష్ణ(గోపీనాథ్) ఆలయం ఉంది. అందులో శ్రీకృష్ణుడి విలువైన ఆభరణాలను దొంగతనం చేసిన ఓ దొంగ.. తొమ్మిదేళ్ల తర్వాత వాటిని తిరిగి గుడి దగ్గర పెట్టేశాడు. దేవుడి నగలను తిరిగి ఇచ్చేయడటంతో పాటు చేసిన పనికి క్షమాపణ కోరుతూ రాసిన లేఖ అక్కడే ఉంచాడు.
అసలేం జరిగిందంటే..
గోపీనాథ్పూర్ లో రాధాకృష్ణ (గోపీనాథ్) ఆలయం ఉంది. 2014 సంవత్సరం మే నెలలో గుడిలో దొంగతనం జరిగింది. శ్రీకృష్ణుడి విలువైన ఆభరణాలు చోరీ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆభరణాలు దొరకలేదు. అలా 9ఏళ్లు గడిచాయి. ఇక నగలు ఎప్పటికీ దొరికే అవకాశమే లేదని గుడి పూజారితో పాటు స్థానికులు నిశ్చయించుకున్నారు.
కానీ, 9ఏళ్ల తర్వాత ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. గోపీనాథ్ ఆలయం ముందు పూజారికి ఓ సంచి కనిపించింది. దాని తెరిచి చూడగా పూజారి విస్తుపోయాడు. అందులో, 9ఏళ్ల క్రితం చోరీ అయిన దేవుడి విలువైన ఆభరణాలు ఉన్నాయి. దాంతో పాటే లేఖ కూడా దొరికింది. ఆ లేఖ రాసింది మరెవరో కాదు. ఆ ఆభరణాలు చోరీ చేసిన దొంగే.
Bhagavad Gita(Photo : Google)
దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరాడు. అంతేకాదు, జరిమానా కింద రూ.300లు ఆలయ ముఖద్వారం దగ్గర వదిలి వెళ్లాడు. ఇటీవలే తాను భగవద్గీత చదివానని.. దొంగతనం ఎంత పెద్ద తప్పో తనకు తెలిసిందన్నాడు. తన తప్పుని తెలుసుకుని విలువైన దేవుడి ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు లెటర్ లో తెలిపాడు. 2014లో యజ్ఞశాలలో ఆభరణాలను చోరీ చేసినప్పటి నుంచి తనకు పీడకలలు వస్తున్నాయని, అనేక సమస్యలు ఎదుర్కొన్నానని లేఖలో తెలిపాడా దొంగ. అందుకే, ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తున్నట్లు వివరించాడు.
‘2014లో నగలను దొంగిలించాను. ఆ ఆభరణాలు చూసినప్పుడల్లా శ్రీ కృష్ణ భగవానుడివిలా అనిపించాయి. దొంగతనం అయితే చేశాను కానీ అప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. రోజూ నిద్రలో పీడకలలు వచ్చేవి. మొదట్లో ఇలాగే ఉంటుందని ఊరుకున్నా. కానీ రోజులు, ఏళ్లు గడిచినా మార్పు లేదు. చెడు కలలు విపరీతంగా రావడం మొదలయ్యాయి. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు. మనశ్శాంతి లేదు, నిద్ర కూడా లేదు. దాంతో ఆరోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. ఆ కలలు నాకేవో చెబుతున్నాయని అనిపించేది. ఇక, ఈ మధ్యే భగవద్గీత చదివా. దొంగతనం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నా. దేవుడి ఆభరణాలు చోరీ చేయడం వల్లే ఇలా జరిగిందని నాకు అర్థమైంది. అందుకే ఆభరణాలు తిరిగిచ్చేశా. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రూ.300 కూడా ఉంచుతున్నా” అని తన లేఖలో పేర్కొన్నాడు ఆ దొంగ.
Bhagavad Gita(Photo : Google)
చోరీ అయిన దేవుడి ఆభరణాలు 9ఏళ్ల తర్వాత తిరిగి ఆ దేవుడి చెంతకే చేరడంతో పూజారి సహా స్థానికులు విస్తుపోతున్నారు. ఇది నిజంగా దైవలీల అని భావిస్తున్నారు. ఆ కృష్ణ పరమాత్ముడే తన నగలను తిరిగి తెప్పించుకున్నాడని విశ్వసిస్తున్నారు.