అజిత్ పవార్ వర్గం అధిక సీట్లలో గెలిచింది.. కానీ, ఎన్సీపీని ఎవరు స్థాపించారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసు: శరద్ పవార్
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
- T Venkateshwarlu
- Published On : November 24, 2024 / 07:38 PM IST
Sharad Pawar and Ajit Pawar
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయని ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ అన్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి చేతిలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఏపీ)కి ఈ ఎన్నికల్లో 41 సీట్లు వచ్చాయి. ఎన్సీపీ (ఎస్పీ)కి మాత్రం కేవలం పది సీట్లే వచ్చాయి. అజిత్ పవార్ అధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ ఎన్సీపీని ఎవరు స్థాపించారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసని శరద్ పవార్ అన్నారు.
ఎన్నికల ఫలితాలపై ఆయన తొలిసారి ఇవాళ మాట్లాడారు. “ఇటువంటి ఫలితాలను మేము ఊహించలేదు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. అజిత్ పవార్కు మా కంటే ఎక్కువ సీట్లు వచ్చాయన్న విషయాన్ని నేను అంగీకరించాలి. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహారాష్ట్రకు తెలుసు” అని శరద్ పవార్ అన్నారు.
శరద్ పవార్ రిటైర్ అయిపోవాలని కొందరు ఎన్సీపీ నేతలు అంటుండడం పట్ల ఆయన స్పందించారు. “నేను ఏం చేయాలన్న విషయంపై నిర్ణయాలు తీసుకోవాల్సింది వారు కాదు. నేను, నా సహచరులు కలిసి నిర్ణయాలు తీసుకుంటాం” అని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
Buddha Venkanna : నాడు విర్రవీగిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ? కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్
