Results Day: తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఈ రిజల్ట్ పైనే ఉంది. కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పది రౌండ్లలో ఫలితం తేలనుంది.
ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్ లో పాల్గొననున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. మధ్యాహ్నంలోగా ఫలితం తేలనుంది. గెలుపు ఎవరిదో తెలిసిపోనుంది. దీంతో ప్రతీ ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితాల సరళి ఏ విధంగా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఈ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఫుల్ ఖుషీగా ఉన్న బీజేపీ, ఎన్డీయే శ్రేణులు విజయోత్సవాలకు రెడీగా ఉన్నాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గతంలో తప్పాయని, ఈసారి కూడా అలానే జరుగుతుందని, గెలుపు మాదే అని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో 66.91 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కోసం 38 జిల్లాల్లో 46 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. అలాగే రెండంచెల పోలీసు భద్రత కల్పించారు.