Arunachalam: అరుణాచలం భక్తులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఆలయ కమిటీ కీలక నిర్ణయం
తిరువణ్ణామలై అన్నామలైయార్ (అరుణాచలం)(Arunachalam) దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- August 21, 2026 / 04:06 PM IST
Arunachalam temple bans mobile phones inside premises from september 1
- అరుణాచలంలో కొత్త ఆంక్షల అమలు
- ఆలయంలోకి మొబైల్స్పై నిషేధం
- రూ.5 కే ఫోన్ క్లాక్రూమ్
Arunachalam: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన తమిళనాడులోని తిరువణ్ణామలై అన్నామలైయార్ (అరుణాచలం) (Arunachalam)దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం అత్యంత కీలకమైన సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఆలయ ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు, గర్భగుడి పరిసరాల్లో భక్తులు ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించడాన్ని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. హిందూ మత, ధార్మిక దానాల శాఖ నిబంధనల ప్రకారం వీఐపీల ఫొటోగ్రఫీపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గిరిప్రదక్షిణ, స్వామివారి దర్శనార్థం వెళ్లే భక్తులు ఈ నిబంధనలను తప్పనిసరిగా గమనించాల్సి ఉంటుంది.
Sowcar Janaki: చిత్రసీమలో తీవ్ర విషాదం.. షావుకారు జానకి కన్నుమూత
భద్రతా కేంద్రాల ఏర్పాటు, క్లాక్రూమ్ రుసుము వివరాలు:
భక్తుల సౌకర్యార్థం తమ ఫోన్లను సురక్షితంగా భద్రపరుచుకోవడానికి ఆలయ పరిసరాల్లో ప్రత్యేక మొబైల్ భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు వైపు రాజగోపురం వద్ద రెండు, ఉత్తర వైపు అమ్మని అమ్మన్ గోపురం వద్ద రెండు, దక్షిణ వైపు తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి మొబైల్ ఫోన్కు రూ.5 రుసుము చెల్లించి, టోకెన్ పొంది ఫోన్ను డిపాజిట్ చేయవచ్చు. దర్శనం ముగిసిన తర్వాత ఆ టోకెన్ చూపించి తిరిగి ఫోన్ను పొందవచ్చని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, సీసీటీవీల పర్యవేక్షణ:
ఆలయ ప్రాంగణంలో మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు ధిక్కరించి అనధికారికంగా ఫోన్లు లోపలికి తీసుకెళ్తే, వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తామని యంత్రాంగం హెచ్చరించింది. భక్తులు దర్శనం సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి, ఆలయ ప్రశాంత వాతావరణాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
