Ashish Mishra : లఖింపూర్‌ ఖేరి కేసులో రిమాండ్‌కు ఆశిష్‌ మిశ్రా?

లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసులో నిందితుడు ఆశిష్‌ మిశ్రాను నేడు రిమాండ్‌కు తరలించే అవకాశముంది. ఆశిష్‌ మిశ్రాను రిమాండ్‌కు అనుమతించాలని జడ్జీకి పోలీసులు దరఖాస్తు సమర్పించారు.

Lakhimpur Kheri violence case : లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటన కేసులో నిందితుడు ఆశిష్‌ మిశ్రాను ఇవాళ రిమాండ్‌కు తరలించే అవకాశముంది. ఆశిష్‌ మిశ్రాను రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ న్యాయమూర్తికి పోలీసులు దరఖాస్తు సమర్పించారు. దీనిపై ఇవాళ విచారణ జరుగనుంది. ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాకు న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. శనివారం రాత్రి ఆశిష్‌ మిశ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ రాత్రే మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఆశిష్‌ మిశ్రాకు 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించారు.

ఈనెల 3న… లఖింపూర్‌ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడిగా ఆశిష్‌ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల మృతిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఆశిష్‌ మిశ్రా పేరును చేర్చారు. దీంతో ఆయనను శనివారం 12గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల విచారణకు సహకరించకపోవడం, పొంతనలేని సమాధానం చెప్పడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

Lakhimpur Kheri Violence : లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్

మరోవైపు లఖింపూర్‌ ఖేరిలో 8మంది రైతుల మృతిపై అన్నదాతలు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కిసాన్‌ సంయుక్త మోర్చా వివిధ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఇవాళ మృతి చెందిన రైతుల అస్తికలతో రైతులు నిరసన తెలుపనున్నారు. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రను కేంద్ర కేబినెట్‌ నుంచి తొలగించాలని, మృతి చెందిన రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని, సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఇవాళ అన్నదాతలు నినదించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు