భారత్ నుంచి వెళ్లిపో: విశ్వభారతి యూనివర్సిటీ విద్యార్ధినికి కేంద్రహోంశాఖ నోటీసులు

  • Published By: vamsi ,Published On : February 29, 2020 / 04:14 AM IST
భారత్ నుంచి వెళ్లిపో: విశ్వభారతి యూనివర్సిటీ విద్యార్ధినికి కేంద్రహోంశాఖ నోటీసులు

Updated On : February 29, 2020 / 4:14 AM IST

కోల్‌కతాలోని విశ్వ భారతి విశ్వవిద్యాలయానికి చెందిన 20 ఏళ్ల బంగ్లాదేశ్ విద్యార్థిని అప్సరాని “ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు” పాల్పడిందనే ఆరోపణలతో దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సెంట్రల్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధి అయిన అఫ్సరా మీమ్‌కు.. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఫిబ్రవరి 14వ తేదీన కోల్‌కతాలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం’లో నోటీసును అందించింది.

దేశంలో అక్రమంగా చొరబడ్డ వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని తీసుకుని రాగా.. దీనికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు  సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ ఉద్యమాల్లో భాగంగానే డిసెంబరులో శాంతినికేతన్ వద్ద సీఏఏ వ్యతిరేక నిరసనలకు సంబంధించి కొన్ని ఫోటోలను అఫ్సర మీమ్ ఫేస్బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆమె పోస్టులు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఆమెను “బంగ్లాదేశ్ ఉగ్రవాది” అంటూ ట్రోల్ చేశారు కొందరు నెటిజన్లు.

అయితే విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపిన ‘లీవ్ ఇండియా నోటీసు’లో ఆమె ఫేస్బుక్ పోస్ట్ గురించి మాత్రం కేంద్రం ప్రస్తావించలేదు. ఈ నోటీసు వచ్చిన 15 రోజులలోపు భారతదేశాన్ని విడిచిపెట్టాలని కేంద్రం అందులో ఆదేశాలు జారీ చేసింది. ఆమె ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందని, వీసా ఉల్లంఘన కింద ఆమెకు భారతదేశంలో ఉండే అర్హత లేదని స్పష్టం చేసింది కేంద్రం. CAA వ్యతిరేక నిరసనలో పాల్గొన్నందుకు డిసెంబరులో కూడా మద్రాస్ ఐఐటిలో ఒక జర్మన్ విద్యార్థిని భారతదేశం పంపేసింది కేంద్రం. 

See Also | తాజ్‌మహల్, ఎర్రకోట లేకపోయుంటే ఆవు పేడను చూపించేవాళ్లా !!