Covid Guidelines : ఆగస్టు 31 వరకు కోవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు
ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది.
- venkaiahnaidu
- Published On : July 28, 2021 / 09:40 PM IST
Covid (1)
Covid Guidelines ప్రస్తుతం ఉన్న కొవిడ్ మార్గదర్శకాలను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో నిబంధలనలు అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు. కోవిడ్ -19 సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐదు అంచెల వ్యూహమైన టెస్ట్-ట్రాక్-ట్రీట్-టీకా-కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి ఉంచాలని ఆ లేఖలో సూచించారు.
కొవిడ్-19 కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా స్థానిక, జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కోరారు భల్లా. కొవిడ్ నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కోవిడ్-19 ప్రోటోకాల్ పాటించే విషయంలో ఆత్మసంతృప్తికి స్థానం లేదని లేఖలో పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుండటం సంతృప్తికర అంశమే. కానీ మొత్తం కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ ఆత్మసంతృప్తికి స్థానం లేదు. జాగ్రత్తగా ఆలోచించి ఆంక్షలను తొలగించాలి. వైరస్ పునరుత్పత్తి సంఖ్య(ఆర్ ఫ్యాక్టర్) 1 శాతం లోపే ఉండటం సానుకూలాంశం. కొన్ని రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువగా ఉంది. ఆర్ ఫ్యాక్టర్ పెరగకుండా చూసుకోవాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలి.రానున్న పండగలు, ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో అజయ్ భల్లా సూచించారు.
