Congress Gets 9 Seats In Tamil Nadu As DMK Repeats 2019 Formula
DMK 2019 Formula : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పార్టీ డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్తో సీట్ల పంపకాల ఒప్పందం ఖరారు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజోయ్ కుమార్ సమక్షంలో ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే సెల్వపెరుంతగై డీల్ ఖరారు చేశారు. డీఎంకే 2019 ఫార్ములా (9+1 సీట్ల షేరింగ్)ను మళ్లీ రిపీట్ చేసింది.
దీని ప్రకారం.. తమిళనాడులో ఇండియా కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్కు డీఎంకే మరోసారి 9 ఎంపీ సీట్లను కేటాయించగా, పుదుచ్చేరిలో ఒక సీటు కేటాయించింది. మొత్తం 40 స్థానాలకు గాను తమిళనాడులోని 9 స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక్క స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.
కలిసికట్టుగా పోరాడి గెలుస్తాం : కేసీ వేణుగోపాల్
అప్పట్లో తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉండగా.. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే కూటమి 38 సీట్లను గెలవగా, 10 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 9 స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని అందుకుంది. త్వరలో జరగబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకుంటుందని వేణుగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య ‘బంధం’ చెక్కుచెదరలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పోరాడి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
2019 ఫార్మూలా ప్రకారమే సీట్ల షేరింగ్ డీల్ ఖరారు :
తమిళనాడు అధికార పార్టీ 2019 మోడల్ను అనుసరిస్తోంది. మిత్రపక్షాలతో సీట్ల షేరింగ్ డీల్స్ ఖరారు చేసింది. అందులో రెండు సీట్లను 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK)కి కేటాయించింది. వైకో నేతృత్వంలోని ఎండీఎంకేకి ఒక స్థానాన్ని కేటాయించింది. ప్రస్తుత లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న చిదంబరం, విల్లుపురం నుంచి వీసీకే పోటీ చేస్తోంది. పార్టీ జనరల్ కేటగిరీ ఒకటితో సహా కనీసం మూడు సీట్లను కోరింది. అయితే, తమిళనాడు, భారత్లోని రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈసారి కూడా డీఎంకే నేతృత్వంలోని కూటమి గెలవాలని గట్టిగా భావిస్తోంది.
అందుకే రెండు రిజర్వ్డ్ నియోజకవర్గాలతోనే సరిపెట్టుకుందని విసీకే నేత తోల్ తిరుమావళవన్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో డీఎంకే ఒక లోక్సభ నియోజకవర్గం, ఒక రాజ్యసభ సీటును ఎండీఎంకేకి కేటాయించింది. అప్పుడు వైకో ఎగువ సభకు ఎన్నికయ్యారు. గత నెలలో డీఎంకే సీపీఎం, సీపీఐలకు 2 లోక్సభ సీట్లను కేటాయించింది.
డీఎంకే కూటమిలో చేరిన కమల్ హాసన్ పార్టీ :
అంతకుముందు, నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మైయం (MNM) తమిళనాడులో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. రాబోయే లోక్సభ ఎన్నికలకు తన మద్దతును అందించింది. 2025 రాజ్యసభ ఎన్నికల కోసం కమల్ పార్టీకి ఒక సీటు ఇచ్చారు. హాసన్, స్టాలిన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ పొత్తు ఖరారు అయింది. ఇద్దరు నేతల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం.. తమిళనాడు, పుదుచ్చేరిలోని 39 లోక్సభ స్థానాల్లో ఎంఎన్ఎం ఎన్నికల ప్రచారం చేయనుంది.
2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి రాష్ట్రంలోని 39 స్థానాలకు గానూ 38 సీట్లు, పుదుచ్చేరిలో ఒక్క సెగ్మెంట్లో విజయం సాధించింది. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఎఐఎడీఎంకె 39వ సీటును గెలుచుకుంది.
Read Also : లోక్సభ ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా