ఇండియాను కరోనా భయపెడుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కీలక రంగాలకు కూడా ఈ వైరస్ సోకుతుండడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా..భారత నావికాదళంలో కేసులు నమోదయ్యిందనే వార్త సంచలనం రేకేత్తోంది. నేవీ ముంబైలో పనిచేస్తున్న 21 మంది నావికులకు
కరోనా వైరస్ సోకింది.
వీరందరినీ క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి కుటుంబసభ్యులను కూడా తరలించినట్లు సమాచారం. వీరు ఎవరెవరితో మాట్లాడారు ? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న INS ఆంగ్రేలో బస చేసిన వారికి కరోనా సోకడంతో..దీనిని లాక్ డౌన్ చేశారు. విభిన్న శ్రేణి, సౌకర్యాల పనితీరును పర్యవేక్షిస్తుంది. ముంబై నేవీ ఆసుపత్రి INHS అశ్వినిలో క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ముంబైలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. చివరకు అదే ముంబైలోని నావికాదళంలో కరోనా కలకలం రేపుతోంది.
భారతదేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత్ కోవిడ్ బాధితుల సంఖ్య 13వేల 835కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 1076 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మరోసారి ఒకేరోజు వెయ్యికి మించి కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒకవైపు లాక్డౌన్ కొనసాగుతున్నా.. మరోవైపు కేసులు అంతకంతకూ పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్లో ఇప్పటి వరకు వెయ్యి కేసులు దాటాయి. గుజరాత్లో శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1021 కు చేరింది. 38 మంది చనిపోయారు.
కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 3, 320 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 201 మందిని కరోనా బలితీసుకుంది. ముంబైలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారావిలో కరోనా కోరాలు చాస్తోంది. ఇక్కడ శుక్రవారం కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 100కి దాటింది.
Also Read | వూహాన్ లోని ల్యాబ్ నుంచే కరోనా వైరస్..ఫాక్స్ న్యూస్ సంచలన కథనం