Home Delivery of Liquor: మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా మద్యం డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. దేశీయ మద్యం, విదేశీ మద్యం ఏదైనా హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించింది ప్రభుత్వం. మద్యం వ్యాపారాన్ని నియంత్రించే కొత్త ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసి, ఈమేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఢిల్లీ ఎక్సైజ్(సవరణ) నిబంధనల ప్రకారం, ఎల్ -13 లైసెన్స్ హోల్డర్లు ప్రజల ఇళ్లకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
ఢిల్లీ అబ్కారీ శాఖ ప్రకటన ప్రకారం.. ఫారం ఎల్ -13 లైసెన్స్ ఉన్నవారు మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసినవారికి భారతీయ మద్యం మరియు విదేశీ మద్యం డోర్ డెలివరీ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాలి. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ చేయరాదు.
కరోనా వల్ల లాక్డౌన్ ఆంక్షలను ఢిల్లీలో అమలు చేస్తుండగా.. ఈ క్రమంలోనే ఎక్సైజ్ చట్టాలలో సవరణ చేశారు. అయితే ఈ నిర్ణయంతో నగరంలోని మద్యం దుకాణాలకు మద్యం హోమ్ డెలివరీ చేయొచ్చు అనే అధికారం ఇచ్చినట్లుగా కాదని, ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రభుత్వం నిర్ణయంతో ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకు హోమ్ డెలివరీ చేసే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మద్యం హోమ్ డెలివరీకి అదనపు ఛార్జీ వసూలు చేయవచ్చు.