మేము సైతం : అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి

  • Publish Date - March 28, 2020 / 02:04 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా  ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో  ఎక్కడి వారక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్ధ స్తంభించిపోయింది. రైళ్లు,బస్సులు విమానాలతో సహా అన్ని ఆగిపోయాయి. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన వలస కూలీలు, కార్మికులు వారి స్వస్ధలాలకు కాలినడకన వెళుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోనిత్యావసర వస్తువులు, కూరల రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇటువంటి సమయంలో ప్రజలకు సేవ  చేసేందుకు ముందుకు వచ్చింది గో ఎయిర్ ఇన్ విమానయాన సంస్ధ . 

ప్రజల కోసం అత్యవవసర సేవలు అందించేందుకు, ప్రజలను చేరవేసేందుకు తమ విమానాలతో పాటు  సిబ్బందిని కూడా అందిస్తామని… తమ సేవలను ప్రజాసేవకు వినియోగించుకోమని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు ఒక లేఖ రాసింది. 

దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించటంతో  దేశీయంగా అన్ని సంస్ధలకు చెందిన 650 విమానాలు కార్యకలాపాలు సాగించకుండా నిలిచిపోయాయి. ఈ సమయంలో 56 విమానాలు, 5,500 మంది సిబ్బంది కలిగిన గోఎయిర్ ఇన్ విమానయాన సంస్ధ ప్రజల కోసం ప్రభుత్వానికి సహకరించటానికి ముందుకు వచ్చింది. 

Also Read | టెన్త్ పరీక్షలు లేకుండా ఇంటర్‌లోకి నేరుగా!