Amarnath Rains : అమర్నాథ్ యాత్రలో మళ్లీ టెన్షన్.. భక్తులను భయపెడుతున్న భారీ వర్షం
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
- Naveen
- Published On : July 26, 2022 / 06:15 PM IST
Amarnath Yara
Amarnath Rains : అమర్నాథ్ యాత్రలో మళ్లీ టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరద వస్తుండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రస్తుతం అమర్ నాథ్ గుహ వద్ద భారీగా భక్తులు ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు వేల మందికిపైగా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావానికి అనుగుణంగా సహాయక చర్యలను భద్రతా సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 8న అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 16మంది భక్తులు మృతి చెందారు.
అమర్నాథ్ గుహ ఉన్న ప్రదేశం నుంచి భక్తులను భద్రతా సిబ్బంది తరలిస్తున్నారు. గంటన్నర నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ వర్షంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఏకబిగిన వర్షం పడుతుండటంతో పర్వతం పైనుంచి పెద్దఎత్తున వరద ప్రవాహం కిందకు వస్తోంది. దీంతో వరద ప్రవాహం మరింత పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతా సిబ్బంది భక్తులను పూర్తిగా అలర్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షం కారణంగా మరోసారి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు.
జులై 8న అమర్నాథ్ గుహ దగ్గర క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గల్లంతయ్యారు. దాంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు.
43 రోజుల పాటు సాగే వార్షిక అమర్నాథ్ యాత్ర జూన్ 30న రెండు ప్రధాన మార్గాల్లో (దక్షిణ కాశ్మీర్లోని 48-కిమీ-పొడవు సాంప్రదాయ నున్వాన్-పహల్గామ్ మార్గం, సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని 14-కిమీ-పొడవు బల్తాల్ మార్గం) ప్రారంభమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 2.30 లక్షల మంది యాత్రికులు గుహ క్షేత్రాన్ని దర్శించారు. ఆగస్టు 11న రక్షా బంధన్ సందర్భంగా అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం, ఈసారి అమర్నాథ్ యాత్రలో మొత్తం 36మంది యాత్రికులు మరణించారు. జూలై 1న పవిత్ర గుహ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 15మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
MLA Raja Singh : అమర్నాథ్లో ఎమ్మెల్యే రాజాసింగ్కు తృటిలో తప్పిన ప్రమాదం
ఆర్టికల్ 370 రద్దుతో 2019లో అమర్నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయ్యింది. తర్వాత కరోనా వ్యాప్తి పెరగడంతో 2020, 2021ల్లోనూ యాత్ర చేపట్టలేదు. ప్రస్తుతం కొవిడ్ నియంత్రణలో ఉండడంతో ఈ ఏడాది యాత్రకు అనుమతి ఇచ్చారు. హిందువులకు అమర్నాథ్ ఒక ముఖ్యమైన పవిత్ర పుణ్యక్షేత్రం. అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3వేల 880 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడకు నేరుగా రహదారి లేదు. భక్తులు కాలినడకన పర్వతం ఎక్కడం ద్వారా పైకి వెళ్లాలి. మంచు కొండల్లో కొలువుదీరిన అమరనాథుడి దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
