Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. కొడియాల వద్ద చిక్కుకున్న తెలుగు యాత్రికులు
డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
- Harishth Thanniru
- Updated on- August 8, 2023 / 08:23 AM IST
Uttarakhand Heavy Rain
Uttarakhand Telugu Pilgrims: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని డెహ్రాడూన్తో పాటు హిల్స్టేట్లోని ఐదు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలోని గౌరీకుండ్ సమీపంలో వరదలు సంభవించాయి.
ఇదిలాఉంటే.. రెండురోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అనేక మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. రుషికేశ్కు 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, వేలాది మంది ప్రజలు నిలిచిపోయారు. వీరిలో బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు. వారంతా తిరుగు ప్రయాణంలో చిక్కుకున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా మంగళవారం పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Akasa Air : Akasa Air : ఆకాశ ఎయిర్ ప్రతీ వారం 900 విమాన సర్వీసులు
డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గర్హ్వాల్, కుమావోన్ ప్రాంతాల్లోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
