CM Mamata Banerjee: దోషిగా తేలితే ఎవరినైనా శిక్షించాల్సిందే.. నా పేరును లాగొద్దు
స్కూల్ రిక్రూట్మెంట్ కేసులో పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విధితమే. తాజాగా మమతా బెనర్జీ స్పందించారు.. తాను ఎలాంటి అవినీతికి, అక్రమాలకు మద్దతు ఇవ్వనని తేల్చిచెప్పారు.
- Harishth Thanniru
- Published On : July 25, 2022 / 07:33 PM IST
Mamatha
CM Mamata Banerjee: స్కూల్ రిక్రూట్మెంట్ కేసులో పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం విధితమే. ఈడీ దాడుల సమయంలో ఛటర్జీ సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశారని, అయిన ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని వార్తలు వచ్చాయి. తాజాగా మమతా బెనర్జీ ఛటర్జీ అరెస్టు పై స్పందించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి, అక్రమాలకు మద్దతు ఇవ్వనని తేల్చిచెప్పారు. దోషులుగా తేలితే ఆ వ్యక్తిని శిక్షించాల్సిందేనని అన్నారు.
ఛటర్జీ ని ఈడీ అరెస్టు చేసిన తరువాత మమత బెనర్జీ తొలిసారి స్పందించారు. “ఎవరైనా దోషిగా నిర్ధారించబడి జీవిత ఖైదు విధించబడినా నాకు అభ్యంతరం లేదు. అయితే.. నా పేరు లాగొద్దు.. నేను ప్రభుత్వం నుండి జీతంకూడా తీసుకోను” అంటూ బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే కుంభకోణంలో సూత్రదారిగా ఈడీ అధికారులు భావిస్తున్న ఫార్థా ఛటర్జీని 26 గంటలకు పైగా విచారించారు. ఎయిర్ అంబులెన్స్లో మంత్రిని సోమవారం ఎయిమ్స్ భువనేశ్వర్కు తీసుకెళ్లాలని విచారణ సంస్థను కోర్టు ఆదివారం ఆదేశించిన విషయం తెలిసిందే.
భువనేశ్వర్లోని వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. ఛటర్జీకి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, అయితే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ బిస్వాస్ చెప్పారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా విచారణ ఏజెన్సీలను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
