West Bengal SSC scam: వెస్ట్ బెంగాల్లో ఈడీ సోదాలు.. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ.20కోట్లు స్వాధీనం
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది.
West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం (West Bengal SSC scam) కేసులో ఈడీ అధికారులు పలువురు మంత్రులు, అధికారులు, మాజీ మంత్రుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్పితా చటర్జీ ఇంట్లో రూ. 20 కోట్లు నగదు, 20 ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మెషీన్ల ద్వారా బ్యాంక్ అధికారుల సహాయం నగదును లెక్కిస్తున్నారు.
ఈడీ దాడిలో స్కామ్తో సంబంధం ఉన్న వ్యక్తుల యొక్క ఇల్లు, కార్యాలయాల నుండి అనేక ఇతర నేరారోపణ పత్రాలు, రికార్డులు, సందేహాస్పద కంపెనీల వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కలకత్తా హైకోర్టు అనేక రిట్ పిటిషన్లలో రిక్రూట్మెంట్ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఛటర్జీ నివాసంపై దాడి చేయడంతో పాటు, విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం శుక్రవారం బెంగాల్ మంత్రులు పార్థ ఛటర్జీ, పరేష్ అధికారి నివాసాలలో సోదాలు చేసినట్లు తెలిపింది. కనీసం ఏడెనిమిది మంది ఈడీ సిబ్బంది ఉదయం 8:30 గంటలకు చటర్జీ యొక్క నక్తలా నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11గంటల వరకు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మరో ఏజెన్సీ అధికారుల బృందం కూచ్బెహార్ జిల్లాలోని మెఖ్లిగంజ్లోని అధికారి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఈడీ అధికారుల వివరాల ప్రకారం.. నగరంలోని జాదవ్పూర్ ప్రాంతంలోని పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాజీ ఛైర్మన్ మాణిక్ భట్టాచార్య నివాసంలో కూడా అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ సిఫారసుల మేరకు ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో గ్రూప్-సి, డి సిబ్బంది, ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు ఈడీ ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేపట్టింది. స్కామ్లో భారీగా నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.