మన దేశంలోని మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గురించి తెలుసా? ఎయిర్‌పోర్టును తలదన్నేలా సౌకర్యాలు..

విశాలమైన కాంకోర్స్ ప్రాంతం, ఆధునిక వెయిటింగ్ లౌంజ్, సౌరశక్తితో నడిచే మౌలిక సదుపాయాలు ఉంటాయి.

రైల్వే స్టేషన్లు అనగానే ప్రభుత్వం నిర్మించినవే ఉంటాయని అనుకుంటాం. ప్రైవేట్‌వి కూడా ఉంటాయి. మన దేశంలోని మొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ గురించి తెలుసా? ఈ రైల్వేస్టేషన్‌లో ఎయిర్‌పోర్టును తలదన్నేలా సౌకర్యాలు ఉంటాయి.

ఈ రైల్వే స్టేషన్‌ ఉన్నది మెట్రోపాలిటన్ రవాణా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందిన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లో కాదు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. అదే రాణీ కమలాపతి రైల్వే స్టేషన్. ఇది దేశంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న తొలి స్టేషన్. దీన్ని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు.

ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) మోడల్‌ కింద అభివృద్ధి చేసిన తొలి స్టేషన్. 2021, నవంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆధునిక స్టేషన్‌ను ప్రారంభించారు. ఇది గోండ్ రాజ్యానికి చెందిన రాణీ కమలాపతికి గౌరవార్థం అంకితం చేశారు.

ఈ స్టేషన్‌ను భారతీయ రైల్వేలు స్టేషన్ మోడర్నైజేషన్ మిషన్‌లో భాగంగా సంపూర్ణంగా మార్చాయి. ఈ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి.

Also Read: చరిత్ర సృష్టించిన బ్యాటర్ జో రూట్.. ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఆటగాడిగా..

సౌకర్యాలు ఇవే..

  • విశాలమైన కాంకోర్స్ ప్రాంతం, ఆధునిక వెయిటింగ్ లౌంజ్
  • సౌరశక్తితో నడిచే మౌలిక సదుపాయాలు
  • సీసీటీవీ పర్యవేక్షణతో హైటెక్ భద్రతా వ్యవస్థలు
  • ఫుడ్ కోర్టులు, బ్రాండెడ్ రిటైల్ ఔట్‌లెట్లు
  • స్టేషన్ ప్రైవేట్ మోడల్ వివరాలు

స్టేషన్ కోడ్ HBJ నుంచి RKMPగా మార్చారు. ఈ ప్రాజెక్టును బన్సల్ గ్రూప్‌, ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (IRSDC) సహకారంతో నిర్వహించింది. స్టేషన్ యాజమాన్యం భారతీయ రైల్వేలదే, కానీ నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలు ప్రైవేట్ రంగానికి అప్పగించారు. సర్వీస్‌ ప్రమాణాలు మెరుగుపడేలా ఈ విధానాన్ని రూపొందించారు.