MP Geeta Kora: లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సింగ్భూమ్ (ఎస్టీ) నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ గీతా కోరా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు. రాంచీలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో గీతా కోరా కాషాయ పార్టీలో చేరారు. బీజేపీ కండువాతో గీతా కోరాను బాబులాల్ స్వాగతించారు.
ఈ సందర్భంగా గీతా కోరా మాట్లాడుతూ.. ఈరోజు నేను బీజేపీలో చేరాను. బుజ్జగింపు రాజకీయాలతో దేశాన్ని కాంగ్రెస్ ఇబ్బందుల్లోకి నెట్టింది. కాంగ్రెస్ పార్టీ అందరినీ వెంట తీసుకెళ్తుందని చెబుతుంది, కానీ అది తన కుటుంబాన్ని మాత్రమే తీసుకువెళుతుందని వ్యాఖ్యానించారు. కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లోని 14 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ-ఏజేఎస్యూ కూటమి 12 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Also Read: గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా?
బీజేపీలోకి వలసల జోరు
కాగా, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. తమిళనాడుకు చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి రెండు రోజుల కిత్రం బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. అంతకుముందు సీనియర్ నేత మిలింద్ దేవరా, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు.