గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా.. యూపీలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితేంటి?

ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా.. యూపీలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితేంటి?

Nehru Gandhi family members shine in UP Elections

Nehru Gandhi Family in UP Elections: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. నెహ్రూ-గాంధీ వారసులకు పెట్టని కోట. నెహ్రూ తరం నుంచి రాహుల్ దాకా అందరూ యూపీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గాంధీ పేరుంటే చాలు..ఉత్తరప్రదేశ్‌లో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుపుఖాయం. అమేథీ, రాయ్‌బరేలీ, ఫిలిబిత్, సుల్తాన్‌పూర్ ఇలా రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల పేర్లు వింటే గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వమే గుర్తొస్తుంది. అలాంటి రాష్ట్ర్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితేంటి? గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులు యూపీలో గెలిచే పరిస్థితులు ఉన్నాయా..?

కాంగ్రెస్ దేశరాజకీయాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోలానే ఉత్తరప్రదేశ్‌లో కూడా హస్తం పార్టీ బలంగా ఉండేది. అలాగే గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌ తో ఎంతో అనుబంధం ఉండేది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచే దేశ తొలి ప్రధాని నెహ్రూ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఫుల్పూర్, రాయబరేలీ నుంచి నెహ్రూ గెలిచారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, అల్లుడు ఫిరోజ్ గాంధీ, ఇందిర కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, మేనకగాంధీ, వరుణ్ గాంధీ, సోనియా, రాహుల్ గాంధీ.. ఇలా గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులెందరినో ఉత్తరప్రదేశ్‌ ఎంపీలను చేసింది. రాయబరేలీ, అమేథీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రెండు నియోజకవర్గాలు గాంధీ-నెహ్రూ కుటుంబానికి పెట్టని కోటగా ఉండేవి. ఫిలిబిత్, సుల్తాన్‌పూర్ నియోజవర్గాలకు మనేక, వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిచంఆరు.

గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా?
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో ఆ రాష్ట్ర్రం నుంచి కాంగ్రెస్‌కు ఉన్న ఒకే ఒక్క ఎంపీ సోనియాగాంధీ. 2004, 2009,2014,2019 ఎన్నికల్లో వరుసగా రాయ్‌బరేలీ నుంచి సోనియా గెలుపొందారు. ఒకప్పుడు మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకునే యూపీలో కాంగ్రెస్ ఒక్కస్థానానికే పరిమితం కావడమంటే పార్టీ ఆ రాష్ట్రంలో ఏ స్థాయిలో బలహీనపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ అక్కడ అధికారంలో లేదు. యూపీలో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అస్తిత్వాన్ని చాటుకుంటోంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలోని రెండు స్థానాల్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్సే. అవే రాయబరేలీ, అమేథీ. సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు బలంగా ఉండి.. తిరుగులేని అధికారం చెలాయిస్తున్న సమయంలోనూ రాయబరేలీ, అమేథిలో గాంధీ-నెహ్రూ కుటుంబ వారసులే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే గత ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోవడంతో గాంధీ-నెహ్రూ కుటుంబ కంచుకోట బద్ధలయిందా అన్న సందేహాలు మొదలయ్యాయి.

రాహుల్ అమేథీ నుంచి పోటీచేస్తారా?
రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రవేశం అమేథీ నుంచే జరిగింది. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎంపీ అయి లోక్‌సభలో అడుగుపెట్టారు. రాహుల్ రాజకీయ జీవితం అమేథీ నుంచే మొదలయింది. కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో అమేథీ నుంచి ఓటమి పాలవడం కాంగ్రెస్ వర్గాలనే కాదు.. యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేశాయి. రాహుల్ నియోజకవర్గానికి రావడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రచారం చేస్తూ వచ్చిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఆయనను ఓడించింది. అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ పోటీచేయడంతో అక్కడ గెలవడం ద్వారా లోక్‌సభకు వెళ్లారు రాహుల్. భారత జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ అమేథిలో పర్యటించినప్పుడు రాహుల్ అక్కడ పోటీ గురించి మరోసారి చర్చ మొదలయింది. రాహుల్ అమేథీ నుంచి పోటీచేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ ఎన్నికల్లో యూపీలో 17 స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించింది మిత్ర పక్షం సమాజ్‌వాదీ పార్టీ. ఈ 17 స్థానాల్లో అమేథీ, రాయబరేలీ నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారన్నది తేలాల్సి ఉంది.

ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే..
నెహ్రూ-గాంధీ కుటుంబ వారసులు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండానే.. నియోజకవర్గం మొహం చూడకపోయినా.. రాయ్‌బరేలీ, అమేథీ ప్రజలు వారిని గెలిపిస్తారన్నది అందరి అభిప్రాయం. కానీ అమేథీలో రాహుల్ ఓటమితో ఆ అభిప్రాయం తప్పని తేలింది. ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా రాహుల్ అంటే అమేథీ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. భారత జోడో న్యాయయాత్రకు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ. అయితే రాహుల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, ఐదేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే అమేథికి వచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలా కాకుండా రాహుల్ అమేథిపై ప్రత్యేకదృష్టిపెట్టాలని.. ఇక్కడినుంచే ఎన్నికల్లో పోటీచేయాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి పక్కనపెడితే.. గాంధీ-నెహ్రూల వారసత్వ ప్రభావం ఇప్పటికీ అమేథీ ప్రజలపై ప్రభావం చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజీవ్‌గాంధీని ఎంతగానో అభిమానించిన అమేథీ ప్రజలు.. అదే ప్రేమను రాహుల్‌పైనా చూపుతున్నారని.. ఒక్కసారి ఓడిపోయినంతమాత్రాన రాహుల్‌కు నియోజకవర్గంతో అనుబంధం పోదని వారి అభిప్రాయం.

ప్రియాంక అక్కడినుంచి పోటీచేస్తారా?
వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన నియోజకవర్గం రాయబరేలీ నుంచి ఈ సారి పోటీచేయడం లేదని సోనియా ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక పేరు వచ్చింది. రాయబరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోటీచేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయబరేలీ నియోజకవర్గం నుంచి నెహ్రూ, ఇందిర, సోనియా ప్రాతినిధ్యం వహించారు. ఆ వారసత్వాన్ని ప్రియాంక కొనసాగిస్తారని భావిస్తున్నారు. మరి ప్రియాంక అక్కడినుంచి పోటీచేస్తారా…? చేస్తే గెలుస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశానికి ప్రధానులు అందించిన రాయబరేలీ.. ఎమర్జెన్సీ విధింపునకూ కారణమైంది. ఆ నియోజకవర్గంలో అసలు గాంధీ-నెహ్రూ కుటుంబం పట్టు ఎలా ఉంది..?

ప్రత్యక్ష ఎన్నికలకు సోనియాగాంధీ దూరం
అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా సోనియాగాంధీ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు వెళ్తున్నారు. వరుసగా నాలుగుసార్లు గెలిపించిన రాయబరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ లేఖ రాశారు. రాయబరేలీ నుంచి సోనియా తప్పుకోవడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీచేయాలన్న డిమాండ్ బయలుదేరింది. ఇప్పటికే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికలు జరిగే ప్రతిరాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి పదవులూ లేనప్పటికీ రాహుల్‌తో కలిసి పార్టీ రాజకీయాలను నడిపిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు తల్లి సోనియా, నాయనమ్మ ఇందిర వారసురాలిగా.. రాయబరేలీ నుంచి ప్రియాంక చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు.

Also Read: ఎన్నికల వేళ బీజేపీకి ఉన్న పాజిటివ్స్‌, నెగిటివ్స్‌ ఇవే..

రాయబరేలీ నియోజకవర్గంపై ఇందిరాగాంధీకి గట్టి పట్టుండేది. అక్కడ ఆమె గెలుపు నల్లేరుపై నడకలా ఉండేది. కానీ ఆ నియోజకవర్గం ఎన్నికపై ఇచ్చిన ఓ తీర్పే దేశంలో చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీ విధింపునకు కారణమైంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీపై పోటీచేసిన రాజ్‌నారాయణ్‌ ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి ఇందిర ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారు. ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగానే ఇందిర దేశంలో అంతర్గత పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఎమర్జెన్సీ విధించారని భావిస్తారు. తర్వాత దేశరాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. అలా స్వతంత్ర భారత చరిత్రలో రాయబరేలికి ప్రత్యేకస్థానముంది. 1980లో ఇందిరాగాంధీ మెదక్ స్థానం నుంచి పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టారు.

ప్రియాంక రాయబరేలిలో గెలుస్తారా?
ఇందిర తరువాత సోనియా రాయబరేలీ నుంచి పోటీచేసిన ప్రతీ ఎన్నికలోనూ గెలిచారు. అలాగే ప్రియాంక గాంధీ కూడా ఈ ఎన్నికల్లో రాయబరేలీ నుంచి పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టాలని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇందిర, సోనియా వారసత్వాన్ని ప్రియాంక కొనసాగించాలన్నది కాంగ్రెస్ నేతల ఆకాంక్ష. అయితే ఉత్తరప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో ప్రియాంక రాయబరేలిలో గెలుస్తారా లేదా అన్నదానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద షాక్. అయితే రాహుల్ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయడంతో ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించగలిగారు. అమేథీలో అయినా, రాయబరేలీలో అయినా గతంలోలా కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు లేవు. ప్రచారానికి రాకపోయినా గెలవలగల స్థితి లేదు. అయితే సోనియా రాయబరేలిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గాంధీ-నెహ్రూ కుటుంబ వారసత్వంతో ప్రియాంక రాయబరేలి నుంచి చాలా తేలిగ్గా గెలుపొందగలరనేది ఓ అభిప్రాయం.

గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటలే
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమేథీ, రాయబరేలీ గాంధీ-నెహ్రూ కుటుంబానికి కంచుకోటలే అన్నది కాదనలేని సత్యం. మాయావతి అధికారంలో ఉన్న సమయంలో ఈ రెండు నియోజకవర్గాల పేర్లు మార్చడానికి ప్రయత్నిస్తే.. స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ స్థాయి ప్రజాదరణ రాహుల్, ప్రియాంకకు ఇప్పుడుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఆ కుటుంబంతో రెండు నియోజకవర్గాల ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉందన్నది మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. అమేథీ నుంచి మూడుసార్లు రాహుల్‌ ను ప్రజలు గెలిపించారు. అలాగే రాయబరేలీ నుంచి ప్రియాంకను ఎంపీగా గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయినా సరే.. రాయబరేలీతో పాటు మరో నియోజకవర్గంలో ప్రియాంక పోటీచేయాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్టు సమాచారం.

Also Read: 100 మంది అభ్యర్థులతో సిద్ధమవుతున్న బీజేపీ.. తొలి జాబితాలో మోదీ, అమిత్ షా పేర్లు?

ఉత్తర భారతదేశంలో పార్టీ బలహీనంగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్, ప్రియాంక పోటీచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. రాహుల్‌కు తెలంగాణ, కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. సోనియా బళ్లారి నుంచి ఓ సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అదే తరహాలో ప్రియాంక కూడా దక్షిణాది నుంచి లోక్‌సభకు పోటీచేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాహుల్, ప్రియాంక ఒకప్పడు పార్టీకి కంచుకోటలైన రాయబరేలీ, అమేథిలతో పాటు ముందు జాగ్రత్తగా మరో స్థానంలోనూ పోటీచేయాలన్నది కాంగ్రెస్ అంతర్గత అభిప్రాయం.