Kangana Ranaut: ‘సైతాను’ అంటూ ఉద్ధవ్ ఠాక్రేపై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు.. ఎందుకంటే?
దేవుడు ఎవరో సైతాను ఎవరో గుర్తించగలమని చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- November 24, 2024 / 09:37 PM IST
Kangana Ranaut
‘సైతాను’ అంటూ శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన (యూబీటీ) కేవలం 20 సీట్లు సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ కంగనా రనౌత్ ఢిల్లీలో మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే ఇంత ఘోరంగా విఫలమవుతారని తాను ముందుగానే ఊహించానని తెలిపారు. దేవుడు ఎవరు? సైతాను ఎవరు? అన్న అంశం.. మహిళలను గౌరవిస్తారా? లేదా? మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తారా? లేదా? అన్న విషయాలపై ఆధారపడి ఉంటుందని కంగనా రనౌత్ అన్నారు. దాన్ని బట్టే దేవుడు ఎవరో సైతాను ఎవరో గుర్తించగలమని చెప్పారు.
సైతాను ఎటువంటి విధిని ఎదుర్కొంటుందో అటువంటిదాన్నే ఉద్ధవ్ ఠాక్రే ఎదుర్కొన్నారని అన్నారు. మహిళలను గౌరవించని వారు ఎన్నటికీ గెలవరని చెప్పారు. వారు ముంబైలోని తన ఇంటిని కూల్చారని, తనను దూషించారని అన్నారు.
కాగా, 2020లో అప్పటి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంతో అప్పట్లో కంగనా రనౌత్ గొడవ పడ్డారు. అప్పట్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంగనా రనౌత్కు చెందిన బాంద్రా బంగ్లాను కూల్చివేసింది. ఆ బంగ్లాను నిబంధనలకు విరుద్ధంగా కట్టారని బీఎంసీ చెప్పింది.
