కర్నాటకలో లాక్డౌన్ పొడిగించారు. మే 10 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ మే 24 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జూన్ 7 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు శుక్రవారం సీఎం యడియూరప్ప ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై శుక్రవారం మంత్రులు, సీనియర్ అధికారులతో జరిగిన సమావేశం అనంతరం యడియూరప్ప ఈ ప్రకటన చేశారు.
నిపుణుల సూచనల మేరకే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. అయితే ప్రస్తుతమున్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కూడా కొందరు రోడ్లపై తిరుగుతున్నారని, వారితోనే అసలు సమస్య అని సీఎం అన్నారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని కోరారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స ఇస్తామని యడియూరప్ప ప్రకటించారు. కాగా, కర్ణాటకలో శుక్రవారం 32,218 కొత్త కోవిడ్ కేసులు, 353 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5,14,238 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.