మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్న నేపథ్యంలో మహావికాస్ అఘాడీ తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిని తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే అవకాశాలు కనపడుతున్నాయి.
మహారాష్ట్రలో టఫ్ ఫైట్ జరగనుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందని చెప్పాయి. దీంతో శనివారం రాత్రిలోపు ఎమ్మెల్యేలను మహారాష్ట్ర నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని మహావికాస్ అఘాడీ యోచిస్తోంది.
దీంతో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తమ ఎమ్మెల్యేలను కొనకుండా చూడవచ్చని భావిస్తోంది. తమ కూటమిలో ఉంటే పోటీ చేసిన రెబల్ అభ్యర్థులను కూడా శిబిరాల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. గురువారం శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సబర్బన్ హోటల్లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలను ఎక్కడ ఉంచాలన్న విషయంపై ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికలలో గెలుపొందే అవకాశం ఉన్న స్వతంత్రులు, రెబల్ ఎమ్మెల్యేలను కూడా తమతో కలుపుకోవాలని వారు భావిస్తున్నారు. “శనివారం రాత్రిలోపు మా ఎమ్మెల్యేలందరినీ మహారాష్ట్ర నుంచి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. దీంతో వారు అమ్ముడుబోయే అవకాశం ఉండదు.
ఎంవీఏ సొంతంగా అధికారంలోకి వస్తుంది. లేదంటే చాలా టఫ్ ఫైట్ జరుగుతుందని మేము నమ్ముతున్నాము. లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల మాదిరిగానే ఇప్పుడు కూడా జరగవచ్చు. అందుకు తగినట్లుగానే మేము సిద్ధం కావాలి’’ అని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ లేదా కర్ణాటకకు తమ ఎమ్మెల్యేలను తరలించే అవకాశం ఉందని అన్నారు.
Mahesh Kumar Goud: అదానీకి తెలంగాణలో ఇంచు భూమి కూడా ఇవ్వలేదు: మహేశ్ కుమార్ గౌడ్