Mamata Banerjee పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపుల వ్యవహారం సర్దుమణగక ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆడియో టేపు దుమారం రేపుతోంది. కూచ్బిహార్ కాల్పుల్లో చనిపోయిన బాధితుల మృతదేహాలతో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ రోజున ర్యాలీ చేపట్టాలని సీతల్కుచి అభ్యర్థితో మమత మాట్లాడినట్లు ఆడియోలో ఉంది. బీజేపీ విడుదల చేసిన ఈ ఆడియో క్లిప్..ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ఘటనను మమత రాజకీయం కోసం వాడుకునేందుకు చూశారంటూ బీజేపీ ఓ రేంజ్లో దుయ్యబట్టింది.
ప్రధాని మోడీ సైతం ఆడియో టేపు వ్యవహారంపై విమర్శలు చేయడం చర్చనీయాంశం మారింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఈ ఆడియో క్లిప్ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. రాజకీయ లాభాల కోసం టీఎంసీ.. మరణాల మీద విందు చేయడాన్ని ఇది సూచిస్తుంది. టీఎంసీ తమ గురించి సిగ్గుపడాలి అని మిస్టర్ నడ్డా ట్వీట్ చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వరంతో ఉన్న ఆడియో క్లిప్ను పరిశీలించాల్సిందిగా స్వాపన్ దాస్ గుప్త నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. మమత వ్యాఖ్యలు పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉద్రిక్తతను ప్రేరేపించేలా ఉన్నాయని బంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి అప్తాబ్కు బీజేపీ నేతలు వివరించారు.
అయితే ఈ ఆడియో క్లిప్ను బీజేపీ తయారు చేసిన బూటకపు క్లిప్గా టీఎంసీ కొట్టిపారేసింది. పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ అభ్యర్థి పార్థా ప్రతింరేతో సంభాషణ ఆడియో క్లిప్ను రికార్డ్ చేసి లీక్ చేశారనే ఆరోపణలతో బీజేపీ చర్యలు తీసుకోవాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ఈ ఆడియో టేప్ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఆడియో టేపు వ్యవహారంపై విపక్షాలు విమర్శలు చేస్తోంటే.. తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఎదురుదాడికి దిగారు. శనివారం గాల్సీ బహిరంగ సభలో మమత మాట్లాడుతూ.. బీజేపీ తన ఫోన్ను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. వంట చేసుకునే కబుర్లతో సహా తమ సంభాషణలను చోరీ చేస్తోందంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొందరు ఏజెంట్లతో కుమ్మక్కై బీజేపీ ఇలాంటి పనులు చేస్తున్నట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు దీదీ. ఇందులో ఎవరెవరు ఉన్నారో తమకు తెలుసని.. ఎవర్నీ వదిలేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపిస్తామని.. ఎవర్నీ వదిలేది లేదని మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక,కూచ్బిహార్ కాల్పుల ఘటనకు సీఐఎస్ఎఫ్ బలగాలే కారణమంటూ.. స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న క్రమంలో, ఈ ఘటనపై రిపోర్టు అందించాలని ఎన్నికల పరిశీలకులను ఈసీ ఆదేశించింది.