దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఫలితంగా వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ఈ విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు, క్లాసులు నడవడం, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (UGC)కు సిపార్సులు చేసింది.
వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ సూచించింది. వర్సిటీలు వారానికి 6 రోజులు వర్కింగ్ డేస్గా ఉండాలని పేర్కొంది. ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్ పూర్తి, ఇంటర్నల్ అసెస్మెంటు, అసైన్మెంట్లు, ప్లేస్మెంటు డ్రైవ్ వంటి ప్రొగ్రామ్స్ మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలని సూచించింది.
ఈ ఏడాదిలో పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి. యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి. ఓఎమ్మార్/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్, ఓపెన్ చాయిస్ అసైన్మెంటు వంటివి అనుసరించాలి. భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలని సూచించింది. మిడ్ సెమిస్టర్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ మార్కులకు 50 శాతం, మిగిలిన వాటికి 50 శాతం మార్కులను విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలని తెలిపింది.
యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్/వార్షిక పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్డౌన్ తొలగింపు పరిస్థితులను బట్టి నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ల్యాబ్ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్వేర్ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలన్నారు. స్కైప్ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు. వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చునని, సెప్టెంబర్ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్ను కూడా ఏర్పాటుచేసింది.