తీహార్ జైలులో డమ్మీ ఉరి పూర్తి…మార్చి-20న నిర్భయ దోషులకు ఉరి!

  • Published By: venkaiahnaidu ,Published On : March 18, 2020 / 04:06 PM IST
తీహార్ జైలులో డమ్మీ ఉరి పూర్తి…మార్చి-20న నిర్భయ దోషులకు ఉరి!

Updated On : March 18, 2020 / 4:06 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నిర్భయ సామూహిక​ హత్యాచార,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరి శిక్ష అమలుకు  సర్వం సిద్ధమవుతోంది. బుధవారం(మార్చి-18,2020) తలారి  పవన్‌  జల్లాద్‌ డమ్మీ ఉరి కార‍్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు  తలారి పవన్ తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలిపారు.

 బుధవారం తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో ‘డమ్మీ ట్రయల్’ జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు.  జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో  దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు.  ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు  లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి తెలిపారు. 

మరోవైపు శిక్ష ఖరారైనప‍్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష  అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు.  తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా  అక్షయ్‌ భార్య  పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో  ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది  చర్చనీయాంశంగా మారింది.

మార్చి 20 ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీయాల‌ని ఈ నెల5న పటియాలా కోర్టు నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. కేసులో దోషులకు శిక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. మరోవైపు ఈ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు మార్చి-16,2020న అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. త‌మ‌కు విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌పై స్టే విధించాల‌ని కోరుతూ.. అక్ష‌య్ సింగ్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌లు  ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్‌ను  ఆశ్రయించారు.