Tungabhadra Dam Gate Washed Away : కర్నాటక రాష్ట్రం హోస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడంపై ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చారు డ్యామ్ అధికారులు. వరద రాకముందే అన్ని గేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. గేట్లు పట్టిష్టంగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. డ్యామ్ కు ఉన్న గేట్లలో మధ్య గేట్లపై ఒత్తిడి పెరగడం వల్లే గేటు కొట్టుకుపోయి ఉండొచ్చని వివరించారు. 19వ గేటుకు ఇరువైపులా ఉన్న గేట్లపై ఒత్తిడి లేకుండా అధికారులు గమనిస్తున్నారు. కాగా, గేటు కొట్టుకుపోయిన వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ బులిటెన్ విడుదల చేయనుంది.
అటు, గేటు కొట్టుకుపోవడం పట్ల అధికారులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టెక్నికల్ ఎక్స్ పర్ట్ కన్నయ్య నాయుడు సూచనల కోసం కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు ఎదురు చూస్తున్నారు. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తాత్కాలిక గేట్ ద్వారా నీటి విడుదల ఆపగలమా లేదా అనేదానిపై నిపుణులు సమాలోచనలు జరుపుతున్నారు. కాగా, ఇంతవరకు ఎమర్జెన్సీ గేట్ డిజైన్ ను అధికారులు చేయకపోవడం గమనార్హం. ఒకవేళ తాత్కాలిక గేట్ (స్టాప్ లాక్ ఎలిమెంట్స్) అమర్చవచ్చని భావిస్తే.. ఎంత వేగంగా చేయగలము అనేదానిపై తర్జనభజనలు పడుతున్నారు.
రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఎక్స్ పర్ట్ నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. తుంగభద్ర బోర్డు అధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 60 అడుగుల వెడల్పు 20 అడుగుల ఎత్తు కొలతలతో స్టాప్ లాక్ ఎలిమెంట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సాధ్యం కాకపోతే డ్యాం నీటి నిలువ 40 టీఎంసీలకు చేరే వరకు వెయిట్ చేయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు అమరావతి, హైదరాబాద్ నుంచి తుంగభద్ర డ్యామ్ కు అధికారులు చేరుకున్నారు.
Alos Read : తుంగభద్ర డ్యామ్కు పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గేటు.. దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు