Omar Abdullah : కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలి.. ఒమర్ అబ్ధుల్లా సవాల్
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
- bheemraj
- Updated on- September 8, 2023 / 02:01 PM IST
Omar Abdullah
Omar Abdullah – Union Government : భారత్ – ఇండియా పేరు వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలని సవాల్ చేశారు. దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్రానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
కేంద్రానికి దమ్ము, ధైర్యం ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఛాలెంజ్ చేశారు. ఈ విషయంలో కేంద్రానికి ఎవరు మద్దతు ఇస్తారో తాము చూస్తామని ఒమర్ అబ్ధుల్లా పేర్కొన్నారు. జీ20 సమావేశాల డిన్నర్ కు రాష్ట్రపతి భవన్ ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంతో పేరు మార్పు వ్యవహారంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కాగా, విపక్ష కూటమి ఇండియా పేరుతో ముందుకు రావడంతోనే కేంద్రం ఈ డ్రామాకు తెర తీసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు నేషనల్ కాన్ఫరన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా సైతం ఇండియా పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు. భారత్, ఇండియా రెండూ ఒకటేనని రాజ్యాంగంలో స్పష్టంగా ప్రస్తావించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా రాజ్యాంగాన్ని చదవాలని సూచించారు.
