ఇది ‘ప్లాస్టిక్’ను తింటుంది
సాధారణంగా మనకు కీటకాలు అనగానే పంటపొలాలను నాశనం చేసే రక్కసి పురుగులే గుర్తొస్తాయి. వాస్తవానికి చాల కీటకాలు ప్రకృతిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి కూడా. అంతేకాకుండా పూల పరాగ రేణువులను ఓ మొక్క నుంచి మరో మొక్కకు మోసుకెళ్లి పంటసాగులో ఎంతో సాయం చేస్తాయి కీటకాలు.
అయితే, ఇప్పుడు పర్యావరణానికి హాని కలిగిస్తున్న “ప్లాస్టిక్” పనిపట్టేందు మళ్లీ వాటినే రంగంలోకి దించుతున్నారు కర్ణాటకలోని ధార్వాడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. భూమిలో కరగని ప్లాస్టిక్ ను సునాయసంగా నాశనం చేసి, పర్యావరణానికి పునర్జీవం పోసే సరికొత్త కీటకాన్ని ధార్వాడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ధార్వాడ్ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగంలో పరిశోధకుడు శీతల్ కేశ్వీ…చిన్న గొంగలి పురుగులా బియ్యం సంచులో కనిపించే ‘రైస్ మోత్ లార్వా’ కీటకాన్ని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. ఎండిపోయిన తేనెతుట్టెలను ప్లాస్టిక్ సంచిలో ఉంచి.. రైస్ మోత్ లార్వా కీటకాలను అందులో వేశారు. కొద్ది రోజులకు సీతాకోక చిలుకలా రెక్కలతో విచ్చుకున్న ఆ కీటకం.. ప్లాస్టిక్ సంచికి రంధ్రాలు చేసుకొని బయటకు రావడం గమనించారు.
అంటే, ప్లాస్టిక్ను ఆ చిన్ని కీటకం కొంతమేర నాశనం చేయగలుగుతుందని గ్రహించారు. ఆపై ఆ కీటకాలకు పోషకాహారం అందించి, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులపైనా ప్రయోగించి సత్ఫలితాలు పొందారు. శీతల్ కేశ్వీ అధ్యయనం అంతర్జాతీయ జర్నల్ లో కూడా ప్రచురితమైంది.
దేశంలో అనేక కీటకాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ, ఈ బియ్యపు పురుగుతో ప్లాస్టిక్ను నాశనం చేసేందుకు జరిగిన అధ్యనం చేయడం మాత్రం ఇదే తొలిసారి.అని శీతల్ కేశ్వీ తెలిపారు. స్పెయిన్ ప్రయోగాన్ని అధ్యయనం చేశాకే తనకు ప్లాస్టిక్ అంతం.. కీటకాలతో ప్లాస్టిక్ వినాశనం అనే రెండు అంశాలపై ప్రయోగం మొదలెట్టాలన్న ఆలోచన వచ్చిందని శీతల్ తెలిపారు.