New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. భవన నిర్మాణ కార్మికులకు సన్మానం
పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు క్యాబినెట్ మంత్రులు పాల్గొన్నారు.
- Harishth Thanniru
- Published On : May 28, 2023 / 09:29 AM IST
New Parliament Inauguration
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 7.15 గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయాన్నే నూతన పార్లమెంట్ భవనం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్ హాల్ లోకి ప్రవేశించారు. అక్కడ వేదపండితులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం (సెంగోల్)ను ప్రధాని అందుకున్నారు.
లోక్సభ స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను ప్రధాని మోదీ ప్రతిష్టించారు. అనంతరం ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు సెంగోల్ కు పుష్పాంజలి ఘటించారు. మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి ముందు పార్లమెంట్ ఆవరణలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అన్ని మతాల పెద్దలు తమ విశ్వాసానికి సంబంధించిన మంత్రాలను పఠించారు. ఆ తరువాత ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ప్రధాని వెంట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అనంతరం పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ అభినందించి వారిని సత్కరించారు.
New Parliament : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం.. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం!
పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, క్యాబినెట్ మంత్రులతో పాటు ప్రధాని మోదీ పాల్గొన్నారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో మొదటి దశ పూర్తయింది. ఆ తరువాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ ఎంపీలు సావర్కర్కు నివాళులర్పించారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు.
