Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరుస్తూ జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ మంగళవారం రిపోర్టు ఇచ్చారు.
యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే అప్రూవల్ ఇచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కమిటీకి యూపీ సింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 2017–18 ధరల ప్రకారం లాంచన ప్రాయమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాతథంగా కేంద్ర కేబినెట్కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరుతూ 2018 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20వేల 398.61 కోట్లుగా నిర్ధారించి.. ఆమోదించాలని అప్పుడే రూ.2వేల 234.28 కోట్లను రీయింబర్స్ చేస్తామని తేల్చిచెబుతూ 2020 అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. దాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపిన కేంద్ర జల్ శక్తి శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరింది.
కేంద్ర ప్రతిపాదనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్లను ఢిల్లీకి పంపారు. కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్లతో వారిద్దరూ సమావేశమై 2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రం ఆమోదించిన భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్ఆర్) ప్యాకేజీ వ్యయం రూ.28వేల 191.03 కోట్లకు పెరిగిందని.. రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యం కాదని.. 2017–18 ధరల ప్రకారమే నిధులను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు.
ఆర్సీసీ ఆమోదించిన వ్యయానికే..
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55వేల 548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)కి పంపి.. మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారమే పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47వేల 725.74 కోట్లుగా తేల్చిన కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు రిపోర్టులు ఇచ్చింది.