violent incidents in Bengal : పశ్చిమబెంగాల్లో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల వేళ చోటుచేసుకున్న హింసాత్మక ఘటన…. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కూచ్బెహర్లో ఘర్షణకు మీరంటే మీరని టీఎంసీ-బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో హింసాత్మక ఘటన కాస్త రాజకీయ రగడకు దారితీసింది. ఈ ఘటనపై టీఎంసీ ఈసీని కలిసి, ఫిర్యాదు చేయబోతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బీజేపీనే కారణమని టీఎంసీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర బలగాల కాల్పుల్లో మరణించింది టీఎంసీ కార్యకర్తలంటున్నారు. రేపు సంఘటనా స్థలానికి సీఎం మమతా బెనర్జీకి వెళ్లనున్నారు. అలాగే బీజేపీ కూడా ఈసీని కలిసి, ఈ ఘటనపై ఫిర్యాదు చేయనుంది.
కూచ్బెహర్ ఘటనపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు ప్రధాని మోదీ. బీజేపీ పాపులారిటీని దీదీ ఓర్వలేకపోతోందన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిని ఆదేశించింది.
అంతకుముందు బెంగాల్లోని కూచ్బెహర్లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ ఓటరు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కూచ్బెహార్లో పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ-టీఎంసీల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్న వాగ్వాదం కాస్త మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మరింత శ్రుతిమించడంతో ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్నారు.
ఆ తర్వాత అక్కడ బందోబస్తుగా ఉన్న సీఐఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన కేంద్ర బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో కాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. కాల్పులు జరిగిన సమయంలో సంఘటనా స్థలం వద్ద సుమారు 600 మంది నిరసనకారులున్నారు.
అటు, హుగ్లీలో బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ వాహనంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పోలీసులు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఎన్నికల కవరేజ్కు వెళ్లిన మీడియా వాహనాలపై కూడా దాడిచేసి ధ్వంసం చేశారు. బీర్బమ్ జిల్లా నానూర్లో 200 కిపైగా నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బాంబు స్క్యాడ్ నిర్వీర్యం చేసింది. రాజ్దంగాలో కస్బా బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్ ఖాన్పై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఈ కాల్పులకు కారణం మీరంటే మీరని అధికార టీఎంసీ, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చనిపోయిన వారు తమ పార్టీ కార్యకర్తలని… కావాలని బీజేపీ కుట్రపూరితంగా ఈ దారుణానికి పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తోంది. అయితే కాదు… కాదు ఈ ఘటనకు టీఎంసీనే కారణమని బీజేపీ అంటోంది.