రాజనీతిజ్ణుడికి గౌరవం : ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

  • Publish Date - January 25, 2019 / 03:28 PM IST

ఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు దివంగత  నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కింది. సాధారణంగా జీవించి ఉన్నవారికి భారతరత్న పురస్కారం ప్రకటించడం అరుదుగా జరుగుతుంటుంది. గతంలో పండిట్ రవిశంకర్, సచిన్ టెండూల్కర్‌, భీమ్ సేన్ జోషి, లతామంగేష్కర్ వంటి కొద్దిమందికే ఇలా ఈ అత్యున్నత పురస్కారం ప్రభుత్వం ప్రకటించింది.

1935 డిసెంబర్ 11న ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్‌లో బీర్బూమ్ జిల్లా మిరాటీలో జన్మించారు. మేధావిగా.. ఏదైనా సంక్షోభం ఎదురైతే దానిని పరిష్కరించే వ్యక్తిగా మంచి పేరుంది. ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుడిగా వ్యవహరించడంతో పాటుగా రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి ఆశ్చర్యపరిచింది. అలా దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012 జులై 25 నుంచి 2017 జులై 25 వరకూ దేశానికి సేవలందించారు ప్రణబ్ ముఖర్జీ.. కేంద్ర, రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అంతేగాకుండా ఆర్థిక మంత్రిగా కూడా చేశారు. ప్రణబ్‌కు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమౌతోంది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న అవార్డు దక్కడంపై ప్రదాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, పార్లమెంటేరియన్‌గా దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. అలాగే… నానాజీ దేశ్ ముఖ్, భూపేన్ హజారికాకు కూడా భారతరత్న పురస్కారం దక్కడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.