కాంగ్రెస్ పార్టీపై హోంమంత్్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆదివారం(సెప్టెంబర్-1,2019)మహారాష్ట్రలోని దాద్రా అండ్ నగర్ హవేలీలో జరిగిన ర్యాలీలో అమిత్షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడారు. అమిత్ షా మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇస్తున్న స్టేట్ మెంట్లను పాకిస్తాన్ ప్రశంసించేవిగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యకు కొద్ది మంది మినహాయిస్తే దేశ ప్రజలంతా ఆమోదం తెలిపారు. 370 రద్దును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
ఇవాల్టికి కూడా రాహుల్ గాంధీ ఏ ప్రకటన చేసినా అది పాక్ను ప్రశంసించేవిగానే ఉంటున్నాయి. ఐక్యరాజ్యసమితికి పాక్ చేసిన విజ్ఞప్తిలోనూ రాహుల్ ప్రకటన ఉందని, ఇండియాకు వ్యతిరేకంగా చేస్తున్న ఇలాంటి ప్రకటనలకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని అమిత్షా అన్నారు.
భారతదేశ సమగ్రతకు 370, 35ఏ అధికరణలు అవరోధంగా నిలుస్తున్నాయని, ప్రధాని మోడీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఆర్టికల్ 370 రద్దు చేశారని అమిత్షా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ద్వారాలు పూర్తిగా తెరుచుకున్నాయని అన్నారు. ఉగ్రవాదంపై చివరి అస్త్రం ప్రయోగించామని షా అన్నారు.