దహన సంస్కారాలకు ముందు శ్వాస పీల్చుకున్న యువకుడు.. అతడు బతికి ఉండగానే చనిపోయాడని ప్రకటించిన డాక్టర్ల సస్పెన్షన్
అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది.
- T Venkateshwarlu
- Published On : November 22, 2024 / 02:37 PM IST
దహన సంస్కారాలకు ముందు గట్టిగా శ్వాస తీసుకున్నాడు ఓ యువకుడు. అతడు బతికి ఉండగానే చనిపోయాడని ప్రకటించిన ముగ్గురు డాక్టర్లను అధికారులు సస్పెండ్ చేశారు. రాజస్థాన్లోని జుంఝును జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డాకర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
రోహితాష్ కుమార్ అనే యువకుడు బధిరుడు.. మాటలుకూడా రావు. షెల్టర్ హోమ్లో అతడు నివసిస్తున్నాడు. గురువారం అతడి ఆరోగ్యం క్షీణించడంతో జుంజునులోని బీడీకే ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించేలా చేశారు షెల్టర్ హోమ్లోని సిబ్బంది. రోహితాష్ కుమార్కు వైద్యులు చికిత్స అందించినప్పటికీ అతడు స్పందించలేదు.
దీంతో అతడు మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. దీంతో అతడికి షెల్టర్ హోమ్లోని వారు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. చివరకు అతడిని చితిపైకి ఎక్కించడానికి లేపగా, గట్టిగా శ్వాస తీర్చుకున్నాడు. దీంతో అంబులెన్సును పిలిచి అతడిని మళ్లీ ఆసుపత్రికి తరలించారు.
అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది. జుంఝును జిల్లా కలెక్టర్ రమవతార్ మీనా ఈ ఘటన గురించి తెలుసుకున్నారు. డాక్టర్ యోగేశ్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్ పచార్లను గురువారం రాత్రి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని మీనా తెలిపారు.
తప్పుచేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారు : మంత్రి లోకేశ్
