బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ

  • Publish Date - October 23, 2019 / 06:09 AM IST

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులు అయ్యారు. ఈ మేరకు అయన బీసీసీఐ వార్షిక సమావేశంలో ఆయన 39వ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

దీంతో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ 33 నెలల పాలన ముగిసింది. 47 ఏళ్ల గంగూలీకి జనరల్ బాడీ మీటింగ్‌లో అధికారికంగా బీసీసీఐ పగ్గాలు అందాయి. దీంతో బీసీసీఐలో కీలక నిర్ణయాలు దాదానే తీసుకోనున్నారు. 

బీసీసీఐ అధ్యక్ష పదవి రేసుకి నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన వివాదాస్పదం కాకుండా మాములుగానే ముగిసింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో గంగూలీ బోర్డు పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ అధ్యక్ష పదవిలో గంగూలీ దాదాపు 10 నెలల పాటు (సెప్టెంబర్ 2020) కొనసాగుతారు. ప్రస్తుతం కోల్‌కతా క్రికెట్ బోర్డు (క్యాబ్) అధ్యక్షుడిగా దాదా ఉండగా.. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టడంతో క్యాబ్ పదవిని దాదా వదిలేయనున్నాడు.

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, ఉత్తరాఖండ్‌కు చెందిన మాహిమ్‌ వర్మ ఉపాధ్యక్షుడిగా, కోశాధికారిగా అరుణ్‌ ధూమల్‌, జాయింట్‌ సెక్రటరీగా జయేష్‌ జార్జ్‌ ఎన్నికయ్యారు.