స్టాండప్‌ కమెడియన్ కునాల్ కమ్రా గొడవ ఏంటి? ఎందుకీ వివాదం? ఎందుకు ఇదంతా జరుగుతోంది?

కునాల్‌ షో జరిగిన హోటల్‌పై గత రాత్రి దాడికి పాల్పడ్డారు.

Stand up comedian Kunal Kamra

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వివాదంతో చిక్కుకున్నాడు. అతడికి సంబంధించిన ఓ వీడియోతో వైరల్ అవుతోంది. దీనిలో అతడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎక్‌నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో శివసేన ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు ఆధారంగా కమ్రాపై సోమవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే, ఇటీవల కమ్రా ఏ వేదికపై ఆ వ్యాఖ్యలు చేశాడో ఆ వేదికను శివసేన పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారని వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: “సలార్‌ 2” సినిమాపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్‌డేట్

గొడవ ఇలా మొదలు?
ముంబైలోని ఖార్‌లో ఓ హోటల్‌లో కునాల్‌ కమ్రా తాజాగా ఓ ప్రదర్శన ఇచ్చాడు. ఇందులో కమ్రా కామెడీ చేస్తూ.. శివసేన నుంచే శివసేన బయటికి వచ్చిందని అన్నాడు. అలాగే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విడిపోయిందని చెప్పాడు. ఇదంతా అయోమయంగా ఉందని అన్నాడు. అక్కడితో ఆగకుండా డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహిగా అభివర్ణించాడు. ఓ హిందీ పాట సాహిత్యాన్ని రాజకీయాలకు వాడుతూ అవమానకర రీతిలో అతడు పాడాడు.

ఈ వీడియోను ఎంపీ సంజయ్‌రౌత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కునాల్‌ కా కమల్‌ అని అన్నారు. దీంతో కునాల్‌పై శివసేన (ఏక్‌నాథ్‌ షిండే వర్గం) కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కునాల్‌ షో జరిగిన హోటల్‌పై గత రాత్రి దాడికి పాల్పడ్డారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరు ఏమన్నారు?
ఈ వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. కామెడీకి పేరుతో ఇలా ఎవరినైనా అగౌరవపరచడం సరికాదని చెప్పారు. దిగజారి కామెడీ చేస్తూ డిప్యూటీ సీఎంను అగౌరవపర్చడమేంటని నిలదీశారు. కునాల్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ.. చట్ట పరిధిని మించి వ్యవహారం ఉండకూదని అన్నారు. ఎవరైనా సరే హద్దుల్లో నడుచుకోవాలని చెప్పారు.

కునాల్ కామారా కాల్ రికార్డులను ప్రభుత్వం పరిశీలిస్తుందని, అతడి బ్యాంక్ ఖాతాలో లావాదేవీలు, దాని వెనుక ఎవరైనా సూత్రధారి ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తుందని మంత్రి యోగేశ్ అన్నారు. వీరే కాకుండా మహారాష్ట్రకు చెందిన చాలా మంది నేతలు ఈ వివాదంపై కామెంట్లు చేస్తున్నారు.