విస్తృత ధర్మాసనానికి శబరిమల తీర్పు బదిలీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 14, 2019 / 05:21 AM IST
విస్తృత ధర్మాసనానికి శబరిమల తీర్పు బదిలీ

Updated On : November 14, 2019 / 5:21 AM IST

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న నలుగురుతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్‌కోర్‌ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ సొసైటీ,దేవస్థాన తంత్రులు,పలువురు భక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిసన్ వేసింది. పలువురు దాఖలు చేసిన దాదాపు 65 పిటిషన్లపై ఇవాళ(నవంబర్-14,2019) సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరిచింది.

దేశంలోని ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని తీర్పు సందర్భంగా సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఒకే మతంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ప్రార్థనా స్థలాలలో మహిళల ప్రవేశం ఈ ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. మసీదులలోకి మహిళల ప్రవేశం కూడా ఇందులో ఉందన్నారు.

తీర్పుపై ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. శబరిమలపై ఇంకా మరింత చర్చ జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో టెంపుల్‌లో అన్ని వయసుల మహిళలను ప్రవేశపెట్టడానికి అనుమతించే తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన సమీక్ష పిటిషన్లను 3.2 మెజార్టీతో ఏడుగురు సభ్యుల విసృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు  ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం పిటిషన్లు పెండింగ్‌లో ఉంటాయని, విస్తృత ధర్మాసనం తదుపరి విచారణ చేపడుతుందని చీఫ్ జస్టిస్ తెలిపారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బెంచీలో జడ్జిలు నారిమన్, చంద్రచూడ్ బదిలీ చేయడాన్ని విభేదించారు. మెజార్టీ తీర్పుతో మత విశ్వాసాలను తక్కువ చేయడం తగదని జస్టిస్ నారిమన్ అన్నారు.